న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు ఏ ఒక్కరి విజయమో, ఓటమో కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోర్టుల్లో ఉన్న అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని కోరారు. మసీదు, మందిరం పక్కనే ఉన్నా ఎలాంటి సమస్య ఉండబోదని వ్యాఖ్యానించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆలయ నిర్మాణంను ఘనంగా ప్రారంభిస్తామని చెప్పారు. అందరం ఐక్యంగా ఉండి ఆలయ నిర్మాణంను పూర్తి చేస్తామని భగవత్ చెప్పారు. మసీదు నిర్మాణానికి ముస్లింలకు భూమి కేటాయింపును స్వాగతించిన మోహన్ భగవత్.. భారతీయులను హిందూ, ముస్లింలు అంటూ రెండు వర్గాలు చూడబోమని మోహన్ భగవత్ చెప్పారు.
రామజన్మభూమి – బాబరీ మసీదు వివాదంపై శనివారం అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. 2.77 ఎకరాల వివాద స్థలం హిందువులకే చెందాలనీ, రామాలయం నిర్మించేందుకు దానిని వెంటనే అయోధ్య ట్రస్టుకు అప్పగించాలనీ కోర్టు తీర్పు చెప్పింది. కేంద్రం మూడు నెలల్లో ఆ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. వివాద స్థలాన్ని మూడు భాగాలుగా పంచాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు సరైనది కాదని ధర్మాసనం ప్రకటించింది. స్థలాన్ని పంచడం ఎట్టిపరిస్థితుల్లో కుదరదని కోర్టు తేల్చింది. న్యాయ వ్యాజ్యంలో పాలుపంచుకోగలిగిన వ్యక్తిగా రామ్ లల్లాను పరిగణిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాద స్థలంపై యాజమాన్య హక్కులు రామ్ లల్లాకే ఇస్తున్నట్లు కోర్టు తేల్చింది. రామజన్మభూమిని మాత్రం కక్షిదారుడుగా పరిగణించలేమని కోర్టు తెలిపింది.