అమరావతి: ప్రజావేదిక కూల్చివేత తర్వాత చంద్రబాబు నివాసంపై దృష్టి పెట్టిన సిఆర్డిఎ అధికారులు కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత మొదలుపెట్టారు. చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని ఎస్టేట్ భవనానికి ఇటీవల రెండవ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయమే అధికారులు గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం సోదరుడికి చెందిన వ్యవసాయ భూమిలో అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.
వారంలోగా కూల్చివేయకపోతే తామే కూల్చివేయాల్సిఉంటుందని గత శుక్రవారం నాడు చంద్రబాబు నివాసం సహా పలు భనాలకు నోటీసు ఇచ్చారు. ఇక వరసగా కరకట్ట కట్టడాలపై అధికారులు దృష్టి సారిస్తారని అనుకోవచ్చు.
అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజావేదిక నుండే ప్రారంభిద్దామని వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి కలెక్టర్, ఎస్పిల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఆ మీటింగ్ అయిన మరుసటి రోజునే టిడిపి హాయంలో నిర్మించిన ప్రజావేదికను సిఆర్డిఎ అధికారులు నేలమట్టం చేసిన విషయం విదితమే. ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి అది కేటాయించడం ఇష్టం లేక కూల్చివేశారని టిడిపి నేతలు నాడు ఆరోపించారు. అనంతరం కృష్ణానది కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నింటికీ సిఆర్డిఎ అధికారులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్కు చెందిన గెస్ట్ హౌస్తో కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవన యజమానులందరికీ నోటీసులు ఇచ్చారు. పలువురు నిర్మాణదారులు కోర్టును ఆశ్రయించడంతో ఆక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో జాప్యం ఏర్పడింది.
తాజాగా రెండు రోజుల క్రితం వారం లోగా స్వచ్చందంగా ఆక్రమ నిర్మాణాలను వారే కూల్చివేసుకోవాలని లేకుంటే సిఆర్డిఎ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత ప్రారంభిస్తామని నోటీసులు ఇచ్చారు. మొత్తం 31 కట్టడాలకు నోటీసులు జారీ చేయగా 20 మంది సిఆర్డిఎ అధికారులకు తమ వాదనలు వినిపించారు. సోమవారం నుండి ఐదు అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో చంద్రబాబు నివాసిస్తున్న లింగమనేని ఎస్టేట్తో పాటు శివస్వామి ఆశ్రమంలో ఉన్న రెండు బిల్డింగ్లు, అక్వా డెవిల్స్ పేరిట ఉన్న ఒక కట్టడం, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం సోదరుడు కోటేశ్వరరావుకు చెందిన కట్టడాలు, మరో రెండు కట్టడాలను ఉన్నట్లు సమాచారం. అధికారులు చెప్పిన విధంగా సోమవారం అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. ముందుగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం సోదరుడి కోటేశ్వరరావుకు చెందిన అయిదు ఎకరాల స్థలంలో కృష్ణానది ఒడ్డున అక్రమంగా కట్టిన చప్టా (ర్యాంప్)ను సిఆర్డిఎ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ టి నాగేంద్రనాధ్ రెడ్డి, జానియర్ ప్లానింగ్ అధికారి ఈడే శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు.