న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కుదరదు అన్న ఒక్క పదంతో ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయితే లోకసభ ఎన్నికలలో పరాజయానికి తాను బాధ్యత వహించాల్సిందేనని రాహుల్ పట్టుబట్టారు. నాలుగు గంటలపాటు సమావేశం జరిగింది. సంప్రదాయంగా వస్తున్న గాంధీ నెహ్రూ కుటుంబ నాయకత్వానికే కట్టుబడాలని పార్టీ నిర్ణయించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీకి రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం అవసరమని, సిడబ్ల్యుసి సమావేశం అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా మీడియాతో పేర్కొన్నారు.
ఆ ఎన్నికలలో కాంగ్రెస్కు 52 సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికలలో కనిష్టస్థాయిలో వచ్చిన 44 సీట్ల కన్నా కొద్ది ఎక్కువ వచ్చినా ఇది అత్యంత ఘోర పరాజయమని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా అనుకుంటున్నది.
మొదటి రిపోర్టు: మధ్యాహ్నం 1:45 గంటలు: లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి బాధ్యత స్వీకరిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారన్న ఊహాగానాలకు తాత్కాలికంగానైనా తెరపడింది. రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదనే లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్సింగ్ సూర్జేవాలా మీడియాకు చెప్పారు.
కాంగ్రెస్ పరాజయానికి కారణాలు వెదికేందుకు శనివారం పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమయింది. ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పరాజయానికి తాను బాధ్యత వహిస్తున్నారని చెప్పారు. రాజీనామా చేస్తారా అని ప్రశ్నించినపుడు, అది తనకూ వర్కింగ్ కమిటీకూ మధ్య విషయమని ఆయన అన్నారు.
ఈ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ రాజీనామా చేశారు. చౌకీదార్ చోర్ హై అన్న నినాదంతో దేశ వ్యాప్తంగా రాహుల్ జరిపిన ప్రచారం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఈ రకమైన నెగెటివ్ ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
2019 ఎన్నికలలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయిదు నెలల క్రితం డిసెంబర్ నెలలో బిజెపి నుంచి గెలుచుకున్న మూడు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పరాజయం పాలయింది. చత్తీస్గఢ్లో మూడు, మధ్యప్రదేశ్లో ఒక్క సీటు వచ్చాయి. రాజస్థాన్లో అయితే ఏదీ లేదు. చివరికి పెట్టని కోట అయిన అమేఠీలో రాహుల్ గాంధీ స్వయంగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో చివరి అస్త్రమైన ప్రియాంకా గాంధీని రంగంలోకి దింపింది. ఆమె ఎంత ప్రచారం చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లలో ఆ పార్టీకి సోనియా గాంధీ పోటీ చేసిన ఒక్క రాయబరేలీ మాత్రమే దక్కింది.