హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం విచారించింది. ఎన్కౌంటర్ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు ఎన్హెచ్ఆర్సీ బృందానికి వివరించారు. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో తమపై దాడిచేసి తుపాకులు లాక్కున్నారన్నారు. కొంతదూరం వెళ్లాక నిందితులు కాల్పులకు తెగబడ్డారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. పోస్ట్మార్టం రిపోర్ట్, సీసీ ఫుటేజీని పోలీస్ అధికారులు ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇచ్చారు. ఈ ఎన్కౌంటర్ సమయంలో గాయపడి కొందరు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పోలీసులకు తగిలిన గాయాలపై ఆ బృందం.. వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంది.
మరోవైపు దిశ హత్యాచార ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు నివేదిక అందించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతపై నివేదికలో వివరాలు పొందపరిచారు. ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదికను సైబరాబాద్ పోలీసులు అందించారు.
ఇదిఇలా ఉంటే.. ఎన్కౌంటర్పై సిట్ బృందం విచారణ జరుపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సిట్ సభ్యులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సిట్ పరిశీలించనుంది.
దిశ కేసు విచారణలో భాగంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితులు నలుగురిని డిసెంబర్ 6వ తేదీన పోలీసులు ఘటనా స్థలికి తీసుకెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులు పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.