టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోట ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదన్న మాట ఇటీవల చాలా తరచుగా వినబడుతోంది. 2019 ఎన్నికలలో పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత అయిదేళ్లలో తాను నవ్యాంధ్రను చాలా గొప్పగా పాలించానని ఆయన భావిస్తున్నారు.
కొత్త రాష్ట్రం అభివృద్ధినీ, ప్రజల సంక్షేమాన్నీ జోడు గుర్రాల లాగా దౌడు తీయించగలిగానని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. మరి ఇంత చేసిన తర్వాత ప్రజలు తనను తిరస్కరించడం ఏమిటి? కొద్ది తేడాతో పరాజయం అయితే చంద్రబాబు ఇంతగా మథనపడేవారు కాదేమో! 175 శాసనసభ సీట్లలో టిడిపి విజయం 23 సీట్లకు పరిమితం కావడం చంద్రబాబును మరింతగా బాధిస్తున్నట్లు ఉంది. వైసిపి ఏకంగా 151 సీట్లలో విజయకేతనం ఎగరేసింది.
చంద్రబాబుకు తన పార్టీ ఓటమి జీర్ణం కాకపోవడానికి ఆయన ముందు నిలబడుతున్న ప్రశ్నలు ఏమిటి? తాను నిజంగానే గొప్పగా పాలించానని చంద్రబాబు అనుకోవడం వరకూ సరే. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అలానే అనుకోవాలని ఏముంది! వారు మరోలా అనుకున్నారేమో! అనుకున్నారేమో కాదు, ఎన్నికల ఫలితాలు మరోలా అనుకున్నారనే చెబుతున్నాయి.
ప్రజలు మరోలా అనుకున్న విషయానికి ఎన్నికల ఫలితాలు దర్పణం పడుతున్నాయని భావిస్తే అలా ఎందుకు అనుకున్నారో బేరీజు వేసుకోవాలి. తాను, తన ప్రభుత్వం ఎక్కడ విఫలమయ్యాయో ఆత్మపరిశీలన చేసుకోవాలి. జన్మభూమి కమిటీలపై వచ్చిన విమర్శలో ఏ మేరకు నిజం ఉందో చూసుకోవాలి. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చిన నిధులను డ్వాక్రా మహిళలు తమకు రద్దు చేసి ఉండాల్సిన వడ్డీ డబ్బు కింద పరిగణించారన్న మాటలో ఎంత మేరకు సత్యం ఉందో వాకబు చేయాలి. అధికార పక్షం శాసనసభ్యుల అవినీతితో ప్రజలు తీవ్రంగా విసుగు చెందిన మాట నిజమో కాదో విచారణ చేయాలి. ఇసుక వ్యాపారం అధికారపక్షంలో ఒక మాఫియాను సృష్టించడాన్ని ప్రజలు క్షమించలేకపోయారన్న మాటలో వాస్తవం ఎంతుందో పరిశీలించాలి.
చంద్రబాబు చిన్నా చితకా రాజకీయ నాయకుడు కాదు. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించి మంచి పాలనా దక్షుడిగా పేరుగాంచిన ముఖ్యమంత్రి. రాజకీయంలో చాణుక్యుడంతటి వాడని పేరు పడిన నాయకుడు. జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన వ్యూహకర్త. పరాజయం ఎంత ఘోరమైనదైనా దానిని అర్ధం చేసుకోవడానికి కావాల్సిన పరిణితి లేని వాడు కాదు. మరి ఎందుకిట్లా పదేపదే ఓటమి గురించి మాట్లాడుతున్నారు? తనను, తన పాలనా దక్షతనూ, తన దార్శనికతనూ ప్రజలు మెచ్చారనే చంద్రబాబు భావిస్తున్నారా? నిజంగానే ఆయనకు ఓటమి అర్ధం కావడం లేదా?
అప్పుడు తన ఓటమికి ప్రజల తీర్పు కాక ఇతరత్రా కారణాలు ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని అనుకోవాల్సివస్తుంది? అలా భావిస్తున్నట్లయితే ఆయన మనసును తొలుస్తున్నది ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లే అయిఉండాలి. ఎన్నికల ముందు బ్యాలెట్ పద్ధతి పునరుద్ధరణ కోసం చివరికంటా పోరాడిన ప్రతిపక్షాలకు నాయకత్వం వహించింది చంద్రబాబు నాయుడే. ఆ అపనమ్మకం వాస్తవరూపం దాల్చి తన పార్టీని మట్టి కరిపించిందని ఆయన భావిస్తున్నారా? అదే నిజమయితే చంద్రబాబు ఆ మాట బహిరంగంగా చెప్పాలి. ఇవిఎంలపై ఆయనకే కాదు, చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలలో పరాజయానికి ఇవిఎంల మాయ కారణమని నిరూపించలేకపోవచ్చు. అంతమాత్రం చేత ఆడలేక మద్దెల ఓడంటున్నారని వచ్చే విమర్శకు భయపడి ఆ మాట బయటకు చెప్పలేకపోవడం చంద్రబాబు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడికి తగదు. కాని పక్షంలో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని అంగీకరించాలి.
-సురయ్యా