అమరావతి: చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రీపోలింగ్ ప్రకటించిన అయిదు కేంద్రాలతో కలిపి ఈ రెండు కేంద్రాలలో కూడా 19వ తేదీన రీపోలింగ్ నిర్వహిస్తారు. తాజాగా కుప్పంబాదూరు, కాలూరు కేంద్రాలలో రీపోలింగ్కు ఆదేశించారు.
పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు కేంద్రాలలో రీపోలింగ్కు ఆదేశించి టిడిపి నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు తర్వాత మరో రెండు కేంద్రాలలో రీపోలింగ్కు నిర్ణయం తీసుకున్నది.
ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై కూడా టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే మళ్లీ ఆ పార్టీ నాయకులే నిన్న వెళ్లి ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యంను కలిసి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో తాము చేసిన ఫిర్యాదులనే ఆయనకు అందించారు. ఆయన వాటిని ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి పంపించారు. అనంతరం ఈ రెండు కేంద్రాలలో రీపోలింగ్ నిర్ణయం వచ్చింది.
ఎప్పుడో తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా వైసిపి అభ్యర్ధి మే ఆరవ తేదీన ఇచ్చిన ఫిర్యాదుపై రీపోలింగ్కు ఆదేశించడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. తాము వెళ్లి నిలదీస్తే సమాధానం చెప్పలేక మరో రెండు కేంద్రాలలో కూడా రీపోలింగ్కు ఆదేశిస్తామని కమిషన్ అధికారులు తెలిపారని ఆయన నిన్న ఢిల్లీలో అన్నారు. ఆయన అన్నట్లుగానే ఎన్నికల కమిషన్ రీపోలింగ్ ప్రకటన చేసింది.