(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బోటు ప్రమాద సంఘటనపై మాజీ ఎంపి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో గోదావరి నదిలో పర్యాటకులతో వెళుతున్న బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎన్డిఆర్ఎఫ్ అధికారులు, గజఈతగాళ్లు ఐదు రోజులుగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ 31మంది ప్రయాణీకుల మృతదేహాలను అధికారులు గుర్తించారు.
అధికారుల లెక్క ప్రకారం 13మంది ఆచూకి లభించాల్సి ఉందని చెబుతున్నారు. బోటు ప్రయాణీకుల సంఖ్యను అధికారులు తప్పు చెబుతున్నారని మాజీ ఎంపి హర్షకుమార్ అన్నారు. తనకు విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం 93 మంది పర్యాటకులతో ఆ బోటు వెళ్లిందని హర్షకుమార్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నానికే బోటు జాడను అధికారులు గుర్తించినా లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయని బోటును వెలికితీయడం లేదనీ ఆయన ఆరోపించారు.
వరద ఎక్కువగా ఉండటం వల్ల దేవీపట్నం ఎస్ఐ బోటు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని హర్షమార్ చెప్పారు. అయితే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ జోక్యం చేసుకోవడం వల్ల బోటు వెళ్లేందుకు కింది స్థాయి అదికారులు అనుమతి ఇచ్చారని హర్షకుమార్ తెలిపారు.
టూరిజం, ఫారెస్టు, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఈ వ్యాపారంలో ఉన్నాయనీ, ప్రభుత్వ అధికారులే వ్యాపారాలు చేస్తున్నారనీ ఆయన ఆరోపించారు. టూరిజం బోట్లపై పూర్తి స్థాయి దర్యాప్తును జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
కాగా హర్షకుమార్ చేసిన ఆరోపణలను మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. తాను ఆ రోజు బోటు అనుమతి కోసం ఏ అధికారిని ఒత్తిడి చేయలేదనీ, ఆయన చెబుతున్నది పచ్చి అబద్దమనీ అవంతి అన్నారు. హర్షకుమార్ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమనీ ఆయన నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనా అని అవంతి ప్రశ్నించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన హర్షకుమార్పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు.