న్యూజిలాండ్ ఉగ్రదాడిపై వీడియోలు
వెంటనే తీసేసిన ఫేస్ బుక్ బృందం
వాషింగ్టన్: న్యూజిలాండ్ మసీదులలో కాల్పులు జరిపిన వీడియోలు ఎంత వద్దన్నా బయటకు వచ్చాయి. అత్యుత్సాహంతో కొంతమంది వాటిని సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. అలాంటివి ఏకంగా 15 లక్షల వీడియోలను ఫేస్ బుక్ ఒక్క రోజులో డిలీట్ చేసింది. హింసాత్మక కంటెంటును సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం ఎంత కష్టమో దీంతో తెలిసింది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదులలో జరిపిన కాల్పులలో 50 మంది మరణించారు. దాన్ని దుండగుడు 17 నిమిషాల పాటు ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దాదాపు గంట సేపటి తర్వాత ఒరిజినల్ ఫుటేజిని సోషల్ మీడియా సైట్లు తీసేసి నిషేధించాయి కూడా. కానీ ఇతర యూజర్లు మాత్రం అప్పటికే దాన్ని డౌన్ లోడ్ చేసుకుని పదే పదే మళ్లీ అప్ లోడ్ చేస్తున్నారు. దాంతో ఆ వీడియోను తమ సర్వర్ల నుంచి దూరంగా ఉంచేందుకు సోషల్ మీడియా కంపెనీలు తలపట్టుకుంటున్నాయి.
వాళ్లతో చర్చిస్తా: ప్రధాని
వీడియో ఎక్కువ ప్రచారం కాకుండా ఫేస్ బుక్ తనవంతు ప్రయత్నాలు చేయాల్సిందిగా వారితో చర్చిస్తానని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. ఫేస్ బుక్ లైవ్ పేరుతో యూజర్లందరూ ప్రత్యక్ష ప్రసారం చేసుకునే అవకాశం 2016 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాతి నుంచి అనేక హత్యలు, ఆత్మహత్యలను కూడా దీనిద్వారా ప్రసారం చేస్తున్నారు. ఇది కేవలం న్యూజిలాండ్ ఒక్క దేశం సమస్యే కాదని జెసిండా అన్నారు.
సోషల్ మీడియాకు తలనొప్పి
మొదట్లో తమ వ్యాపార లాభాల కోసం ఒకదాని తర్వాత ఒకటిగా సదుపాయాలు పెంచుకుంటూ పోయిన సోషల్ నెట్ వర్కింగ్ కంపెనీలు ఇప్పుడు తల పట్టుకుంటున్నాయి. ఈ తరహా వీడియోలను తమ సైట్ల నుంచి ఎలా దూరం పెట్టాలో వారికి అర్థం కావడం లేదు. ఈ వీడియోను అప్ లోడ్ చేయడానికి జరిగిన దాదాపు 12 లక్షల ప్రయత్నాలను ఫేస్ బుక్ బ్లాక్ చేసింది. ఈ వీడియోను ఆటోమేటిగ్గా గుర్తించడంతో ఇది సాధ్యమైంది. మరో 3 లక్షల క్లిప్పింగులు లైవ్ లోకి వెళ్లిన తర్వాత వాటిని డిలీట్ చేశారు.
మేం తీసేస్తాం: ఫేస్ బుక్
దుండగుడి ఫుటేజికి సంబంధించిన ఏ వీడియో క్లిప్ అయినా తాము తీసేస్తామని ఫేస్ బుక్ ప్రతినిధి మియా గార్లిక్ తెలిపారు. బ్రిటన్ కు చెందిన పలు వార్తా సంస్థలు కూడా తమ సైట్లలో తొలుత ఈ వీడియో పెట్టాయి. వాటిలో మెయిల్ ఆన్ లైన్, ద సన్, ద మిర్రర్ లాంటివి ఉన్నాయి. మెయిల్ ఆన్ లైన్ అయితే దుండగుడి 74 పేజీల మేనిఫెస్టోను కూడా పూర్తిగా పెట్టేసింది. తర్వాత దాన్ని తీసేశారు. ఇంత జరిగినా ద సన్, డైలీ మెయిల్ పత్రికలలో మాత్రం వీడియో హోస్టింగ్ చేసినందుకు సోషల్ మీడియాను తిట్టిపోశాయి. యూట్యూబ్ కూడా ఈ వీడియోను తీసేయడానికి చర్యలు మొదలు పెట్టింది. అదే వీడియోను పెడితే అడ్డుకోవడం సులభమే. కానీ యూజర్లు దాన్ని ఎడిట్ చేసి, లేదా ల్యాప్ టాప్ తో దాన్ని మళ్లీ షూట్ చేసి పెట్టేస్తున్నారు. అలాగే వాట్సాప్, టెలిగ్రాం లాంటివాటి ద్వారా ఎన్ క్రిప్ట్ అయి కూడా చక్కర్లు కొట్టే ప్రమాదం కనిపిస్తోంది.