హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజి మంత్రి డికె అరుణ కూడా కాంగ్రెస్ పార్టికి షాక్ ఇచ్చారు.
ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టికి గుడ్ బై చెప్పి అధికార పార్టిలో చేరుతుండటం ఆ పార్టీని తీవ్ర కల్లోలానికి గురి చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పొయే పరిస్థితి నెలకొంది.
ఇటీవలే మాజీ మంత్రి, మల్లేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కారెక్కుతున్నట్లు (టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు) ప్రకటించారు. ఆమె పార్టి వీడకుండా ఉండేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రయత్నం చేసారని వార్తలు వచ్చాయి. అయినా అమె నిర్ణయాన్ని మార్చుకోలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుండి పోటీ చేసిన డికె అరుణ పరాజయం చవిచూశారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు అధికార టిఆర్ఎస్ గూటికి చేరుతుండగా, డికె అరుణ దానికి భిన్నంగా జాతీయ పార్టి బిజెపిని ఎంచుకున్నారు.
బిజెపి సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ మంగళవారం రాత్రి డికె అరుణతో భేటి అయి చర్చించిన అనంతరం ఢిల్లీ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం తెలంగాణాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టిలో సముచిత స్థానం, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అంశం తదితర విషయాలపై స్పష్టత లభించడంతో వెంటనే పార్టీలో చేరేెందుకు అంగీకరించారు. అరుణకు అమిత్ షా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో డికె అరుణ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పార్టీని వీడటం జిల్లాలో కాంగ్రెస్ కు గట్టి దెబ్బగానే భావిస్తున్నారు.
డికె అరుణ 2004, 2009 అసెంబ్లి ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుండి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.