(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తర భారతంలోని తీవ్ర వడగాడ్పులు రైలు ప్రయాణీకులను బలి తీసుకున్నాయి. కేరళ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మధ్యప్రదేశ్లోని ఝాన్సీ వద్ద వడదెబ్బకు మరణించారని ఇండో ఆసియన్ న్యూస్ సర్వీస్ తెలిపింది. రైలులో ప్రయాణిస్తున్న వారు సోమవారం సాయంత్రం వంట్లో బాగోలేదని సహప్రయాణీకులకు చెప్పారు. రైలు ఝాన్సీ చేరేసరికి వారు మరణించారు. మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు.
మృతదేహాలను ఝాన్సీలో దించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఎస్8, ఎస్9 బోగీల్లో ఆగ్రా నుంచి కోయంబత్తూరు ప్రయాణిస్తున్న వారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కోయంబత్తూరు పంపే ఏర్పాట్లు చేస్తామని డివిజనల్ రైల్వే మానేజర్ చెప్పారు. మృతులు వారణాసి, ఆగ్రా చూసేందుకు వెళ్లిన 68 మంది బృందంలో సభ్యులు.