బెంగళూరు: 180 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన గోఎయిర్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎ-320 విమానం టేకాఫ్ అయింది. ఈ ఘటన బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. అయితే,ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు కారణమైన పైలట్ని సస్పెండ్ చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ప్రకటించింది.
Yes the flight missed the runway but it didn't land there … The pilot saved us by taking off and ultimately landing in Hyderabad. I was on that flight. pic.twitter.com/u8ha2HVX1k
— Shafeeq Hamza (@shamza) November 14, 2019
ఎ-320 విమానం కమర్షియల్ జెట్ విమానం నవంబర్ 11వ తేదీ సోమవారం నాగ్ పూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం అదే రోజున బెంగుళూరులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, బెంగళూరులో ల్యాండ్ అయ్యే క్రమంలో రన్ వే నుంచి డైవర్ట్ అయింది. పక్కనే ఉన్న గడ్డి మైదానంలో నుంచి దూసుకెళ్లింది. ల్యాండింగ్ సమయంలో పైలట్ ఇంజిన్ వేగాన్ని మరింత పెంచి టేకాఫ్ చేశాడు. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేకుండా టేకాఫ్ అయ్యి.. హైదరాబాద్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదకర స్థితిలో టేకాఫ్ చేసిన పైలట్ పై చర్యలు తీసుకున్నట్టు డిజిసిఎ తెలిపింది. దీనిపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను డిజిసిఎ ఆదేశించింది.
గత నెలలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన గో ఎయిర్ విమానం కూడా అత్యవసరంగా ల్యాండైన సంగతి తెలిసిందే. ఏయిర్ బస్ ఏ 320 విమానం షెడ్యూల్ ప్రకారం పాట్నాకు వెళ్లాల్సి ఉంది. కానీ విమానంలో ఏదో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే పాట్నా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. ఇందులో 146 మంది ప్రయాణీకులున్నారు. సురక్షితంగా విమానం ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.