అమరావతి: కుటుంబ వార్షిక ఆదాయం అయిదు లక్షల రూపాయలలోపు ఉన్న వారందరికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. తెలుపు రంగు రేషన్ కార్డు కల్గి ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేకున్నా అయిదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. వైయస్ఆర్ పెన్షన్ కానుక కార్డు, జగన్నన్న విద్యా, వసతి దీవేన కార్డుకు అర్హత ఉన్న కుటుంబాలు కూడా అర్హులుగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇతర కుటుంబాలకు, ఈ క్రింది ప్రమాణాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.
- 12 ఎకరాల కన్నా తక్కువ తడి భూమి, 35 ఎకరాల కన్నా తక్కువ పొడి భూమి ఉన్న భూ యజమానులూ అర్హులే.
- తడి, పొడి భూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు
- అయిదు లక్షల వరకు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు
- 3000 ఎస్ఎఫ్టి (334 చదరపు అడుగులు) కన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు
- అయిదు లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అర్హులు
- ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు
- కుటుంబంలో ఒక కారు ఉన్నా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు
- కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు
గత ప్రభుత్వాల హయాంలో తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ పథకం వర్తించేది. దీంతో అదాయం ఎక్కువగా ఉన్న వారు సైతం చాలా ప్రాంతాల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవల కోసం తెలుపు రంగు రేషన్ కార్డులు పొందారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బోగస్ రేషన్ కార్డుల తొలగింపుకు మార్గం సుగమం అవుతుంది. అనర్హులకు రేషన్ కార్డులను తొలగించినప్పటికీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నందున ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు.