అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి మొదలుపెట్టిన యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి సిబిఐకి అనుమతి ఇచ్చాం.
- ప్రజాధనం వృధా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ చేపడతాం.
- ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తాం.
- విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్ని నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
- నవరత్నాల అమలు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చర్యలు తీసుకుంటాం.
- అర్హులైన ప్రతి ఒక్కరికి గృహవసతి కల్పిస్తాం. నాలుగేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పని చేస్తాం. వంద శాతం పారదర్శకత దిశగా సిఎంఒ పని చేస్తుంది.
- దశలవారీగా మద్య నిషేదం అమలు చేస్తాం. మద్యం బెల్ట్ షాపులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాల సహకారంతో ముందుకు వెళతాం.
- పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను 12వేల రూపాయల నుండి 18వేల రూపాయలకు పెంచాం.
- ఆశవర్కర్ల వేతనాలను మూడు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకు పెంచాం. ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతి, పెంచిన మొత్తాన్ని ఈ ఏడాది జూలై నుండి చెల్లిస్తాం.
- ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ఏటా జనవరిలో ప్రకటిస్తాం. యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో యువతకు శిక్షణ ఇస్తాం.
- పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు 12,500రూపాయలు అందిస్తాం. సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం.
- పోలవరం, వెలిగొండ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తాం.
- అమ్మవడి పథకం కింద మహిళలకు ఏటా 15వేల ఆర్థిక సాయం చేస్తాం.
- ఎస్సి, ఎస్టి, బిసి, కాపు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.
- 108 అంబులెన్స్ వాహనాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.
- సుస్పష్టమైన ప్రజాతీర్పును దృష్టిలో ఉంచుకుని అయిదు కోట్ల ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు, వారి కలలు సాకారం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం పూర్తి పాఠం కొరకు కింద క్లిక్ చేయండి….