లక్నో: కడుపు నొప్పితో విలవిల్లాడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తికి పరీక్షలు చేసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. అతని శరీరంలోని చాలా అవయవాలు సాధారణ స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో ఉండడం వారిని షాక్కు గురిచేసింది. ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు.. కుడివైపుకు ఉండాల్సిన కాలేయం, పిత్తాశయం ఎడమవైపుకు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ లో జరిగిందీ ఘటన. జమాలుద్దీన్ అనే యువకుడు ఇటీవల కడుపు నొప్పితో బాధపడుతూ గోరఖ్పూర్లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేశారు. ఆయా రిపోర్టులను పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి గుండె కుడివైపు, కాలేయం ఎడమవైపున ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, చాలావరకు భాగాలు నిర్ధారిత స్థానాల్లో కాకుండా వేర్వేరు చోట్ల ఉండడంతో విస్తుపోయారు.
జమాలుద్దీన్ ఎక్స్రే రిపోర్ట్స్ చూసి షాక్ తిన్నట్టు శశికాంత్ దీక్షిత్ తెలిపారు. అతని శరీరంలో చాలావరకు అవయవాలు ఉండాల్సిన స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో ఉన్నట్టు తెలిపారు. ఇలాంటి వ్యక్తులకు సర్జరీ చేయడం చాలా కష్టమన్నారు. జమాలుద్దీన్ గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో రాళ్లు ఉన్నట్టు గుర్తించి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించామన్నారు. అయితే, ఆపరేషన్ చాలా కష్టమైందని వైద్యుడు శశికాంత్ దీక్షిత్ తెలిపారు. కుడివైపున ఉండాల్సిన బ్లాడర్.. ఎడమవైపు ఉండటంతో అందులో రాళ్లు తొలగించడం చాలా కష్టంగా మారింది. మూడు రకాల ల్యాప్రోస్కోపిక్ యంత్రాలను ఉపయోగించి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి కేసును చూడడం తన కెరియర్లో ఇదే తొలిసారని తెలిపారు.