(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యోదంతంపై కొన్ని శక్తులు మతం రంగును పులుముతున్నాయి. ప్రధాన నిందితుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ఒక మతానికి సంబంధించిన వాడు కావడంతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు ఈ ప్రచారానికి తెర తీశారు. నవంబర్ 27వ తేదీ రాత్రి నలుగురు వ్యక్తులు వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడి చేసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా ఏ1గా ఉన్నాడు. నవీన్ (డ్రైవర్), శివ (క్లీనర్), చెన్నకేశవులు (క్లీనర్)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ప్రెస్ మీట్ కంటే ముందే వారి పేర్లు బయటకి వచ్చాయి. అయితే, నిందితుల్లో పాషా పేరునే కొందరు హైలేట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ కార్యకర్తలు, హిందూవులు పాషా పేరును సోషల్ మీడియాలో వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు కూడా కేవలం పాషా పేరును మాత్రమే చెప్పాయి. అంతేకాదు ఈ ఘటనను వక్రీకరించే ప్రయత్నం చేశాయి.
ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులు ఉంటే.. కేవలం పాషా పేరును మాత్రమే ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయ్నతించారు. ‘మహ్మద్ పాషా తన గ్యాంగ్ తో హైదరాబాద్ వైద్యురాలిపై అత్యాచారం చేసి సజీవ దహనం చేశాడు. హిందూ మహిళలే వారి లక్ష్యంగా ఉంది’ అని ప్రశాంత్ పటేల్ ఉమ్రాన్ అనే వ్యక్తి ట్వీట్లు చేశారు.
దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయంటే… అవి కేవలం మృగాళ్ల ఆలోచనల తప్పే కానీ ఏ ఒక్క మతానికో, కులానికో అంటగట్టడం మూర్ఖత్వమే అవుతుంది. ఏ మత గ్రంథం అయినా, ఏ కుల కట్టుబాట్లు అయినా, మహిళలపై అత్యాచారాలు చేయాలని, హత్యలకు తెగబడండని చెప్పవు. ఇలాంటి ప్రచారానికి ఆదిలోనే పుల్స్టాప్ పెట్టడం సమాజానికి ఎంతో మంచిదనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతా రహితమైన మీడియా ఇలాంటి ఘటనల్లో ద్వేషాన్ని తగ్గించడానికి బదులుగా తప్పుదోవ పట్టించే కథనాన్ని ప్రసారం చేయడం గమనార్హం.
నవంబర్ 27వ తేదీ సాయంత్రం బాధితురాలు తన ఇంటి నుంచి బయలుదేరింది. 6 గంటల సమయంలో టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. అక్కడ తన స్కూటీని పార్క్ చేసి గచ్చిబౌలి బయలుదేరింది. టోల్ ప్లాజా సమీపంలో ఆమె స్కూటీ పార్కు చేయడాన్ని ఆరిఫ్తో పాటు నిందితులు గమనించారు. దీంతో వారి మెదడులో దురాలోచన మొదలైంది. అఘాయిత్యానికి పాల్పడాలని నిర్ణయించుకున్న నిందితులు మద్యం తాగుతూ ఎలా చేయాలని చర్చించుకున్నారు. స్కూటీ టైర్లో గాలి తీసేస్తే ఆమె ఆగిపోతుందని నవీన్ ఐడియా ఇచ్చాడు. అతడే దాన్ని ఆచరణలో పెట్టాడు. బాధితురాలు రాత్రి 9.22 గంటలకు ప్రాంతంలో తిరిగి తొండుపల్లి టోల్ గేట్ వద్దకు చేరుకుంది. ఆమె తన బైక్ వద్దకు రాగానే ఆరిఫ్ ఆమె దగ్గరికి వెళ్లి మీ స్కూటీ టైర్ పంక్చర్ అయింది.. సాయం చేస్తామని నమ్మించాడు. దీంతో ఆమె వారికి బైక్ ఆప్పగించింది. స్కూటీ తీసుకొని వెళ్లిన శివ.. కాసేపటి తర్వాత తిరిగొచ్చి.. పంక్చర్ షాపు క్లోజ్ అయిందని చెప్పాడు. మరో చోటకు వెళ్లాడు. ఈలోగా బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి మాట్లాడింది.
తన స్కూటీ పంక్చర్ అయిందని.. అక్కడ లారీ డ్రైవర్లను చూస్తే భయమేస్తోందని.. ఏడుపొస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘దెయ్యం పిల్లగాడు నా బైక్ తీసుకెళ్లాడు.. ఎప్పుడు వస్తాడో’ అని మాట్లాడింది. టోల్ ప్లాజా వద్దకు వెళ్లమని సోదరి సలహా ఇవ్వగా ఆమె అక్కడికి వెళ్లడానికి బిడియపడింది. అందరూ తనను వింతగా చూస్తారని చెప్పింది. ఫోన్ కట్ చేసిన కాసేపటికే ఆరిఫ్, నవీన్, చెన్నకేశవులు కలిసి బాధితురాలిని అపహరించి నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లారు. ఈలోగా స్కూటీపై తిరిగొచ్చిన శివ కూడా అక్కడికి చేరుకున్నాడు.
తనను వదిలివేయాల్సిందిగా బాధితురాలు వేడుకున్నా ఈ నరరూప రాక్షసులు కనికరం చూపించలేదు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆమె ఆవేదన ఎవ్వరికీ వినపడలేదు. అఘాయిత్యం చేసేటప్పుడు యువతి ప్రతిఘటిస్తున్న సమయంలో నోట్లో బలవంతంగా మద్యం పోశారు. యువతి ప్రతిఘటిస్తున్న సమయంలో అరవకుండా నోరు, ముక్కు మూయడంతో బాధితురాలు ఊపిరి ఆడక చనిపోయింది. ఆమె చనిపోయిన తరువాత మృతదేహంపై కూడా ఈ మానవ మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు.
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో