(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏదయినా నేరుగా చెబితేనే సరిగా అర్ధం చేసుకుంటారన్న నమ్మకం లేదు. అలాంటిది వ్యంగంగా చెబితే! ఎదురుతిరగకుండా ఉంటుందా? ఐఎఎస్ అధికారి నిధి చౌధరి విషయంలో అదే జరిగింది. మహాత్మా గాంధీ 150వ జయంతి సంవత్సరంలో ఆయన స్మృతికి జరుగుతున్న అవమానాలు చూసి ఆ మహారాష్ట్ర క్యాడర్ అధికారికి కడుపు మండినట్లుంది. ఒక ట్వీట్ పోస్టు చేశారు.
ఆ ఇంగ్లిష్ ట్వీట్ను తెలుగులో రాస్తే ఎలా ఉంటుందంటే: ‘ఆహా 150వ జయంతి సంవత్సరాన్ని ఎంత గొప్పగా జరుపుకుటున్నాం!
ఇక మన కరెన్సీ నోట్ల మీద నుంచి ఆయన ముఖాన్ని తొలగించడం, అయన విగ్రహాలు తీసెయ్యడం, ఆయన పేరు మీద ఉన్న సంస్థలు, రోడ్లకు ఆ పేరు తొలగించడమే బాకీ.
మనమందరం ఆయనకు అర్పించగల నిజమైన నివాళి ఇదే. థాంక్యు గాడ్సే.
ఈ ట్వీట్ చూసిన కొందరు నిధి నిజంగా మహాత్ముడికి అపచారం చేసిందనుకున్నారు (నిజంగా అనుకున్నారో లేక..). ఇక ఆన్లైన్లో ఆమెపై ట్రోలింగ్ మొదలయిది. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జితేంద్ర అవధ్ డిమాండ్ చేశారు. దానితో నిధికి తత్వం బోధపడింది. వెంటనే ఆ ట్వీట్ తొలగించారు. వ్యంగ్యాన్ని అర్ధం చేసుకోకపోతే ఎలా అంటూ వాపోయారు. నిధి చౌధరి బృహన్ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్లో పని చేస్తున్నారు.
మహాత్ముడి 150వ జయంతి సంవత్సరంలో, ఆయనను హత్య చేసిన నాధూరాం గాడ్సేను బిజెపి నేత ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశభక్తుడిగా కీర్తించడంతో వివాదం మొదలయింది. గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అని సినీ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. అందుకg ఆయనపై కేసులు పెట్టారు. గాంధీజీని తెగనాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తూనే ఉన్నాయి.