ఢిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విద్యార్థులు బస్సులతో పాటు పలు ఆస్తులకు నిప్పంటించారు. ఆందోళనలను నియంత్రించే క్రమంలో పోలీసులు జరిపిన దాడుల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ సందర్భంగా యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ, ఢిల్లీలోనే తమకు రక్షణ దొరకకపోతే… ఇంకెక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘విద్యార్థులకు సురక్షిత ప్రాంతంగా ఢిల్లీని భావిస్తుంటాం. ఇది సెంట్రల్ యూనివర్శిటీ కూడా. ఇలాంటి చోట మాకు పూర్తి రక్షణ ఉంటుందని, మాకు ఏమీ జరగదని నేను భావించాను. కానీ, జరిగిన ఘటనలతో రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?’ అంటూ మీడియా ఎదుట సదరు విద్యార్థిని కంటతడి పెట్టింది.
ఈ దేశం సురక్షితం కాదని ఇప్పుడు తాను భావిస్తున్నానని ఆమె పేర్కొంది. రేపు భారతీయులే తన స్నేహితులుగా ఉంటారా ? అనే సందేహం నెలకొందని వ్యాఖ్యానించింది. తాను ముస్లింను కానప్పటికీ… తొలి రోజు నుంచి తాను టార్గెట్ గానే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మంచికి అండగా నిలబడే పరిస్థితి కూడా లేనప్పుడు ఈ చదువు ఎందుకని ప్రశ్నించింది. యూనివర్శిటీలో హింస చెలరేగే సమయానికి తాను లైబ్రరీలో ఉన్నానని ఆమె తెలిపింది. యూనివర్శిటీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తనకు సూపర్ వైజన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పింది. లైబ్రరీ నుంచి తాను వెళ్లబోతుండగా.. కొందరు విద్యార్థులు పరుగున లైబ్రరీలోకి వచ్చారని… 30 నిమిషాల్లోనే లైబ్రరీ మొత్తం విద్యార్థులతో నిండిపోయిందని తెలిపింది. కొందరు విద్యార్థుల ఒంటిపై అప్పటికే రక్తం ఉందని చెప్పింది. ఇంతలోనే లైబ్రరీలోకి పోలీసులు వచ్చారని… తమను దుర్భాషలాడారని పేర్కొంది. లైబ్రరీ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లిపోవాలని వారు గట్టిగా అరిచారని చెప్పింది.
ఆ తర్వాత తాను తన హాస్టల్ కు బయల్దేరానని… అప్పటికే కొందరు విద్యార్థులు అపస్మారక స్థితిలో రోడ్డుపై పడి ఉండటాన్ని తాను చూశానని ఆమె తెలిపింది. దీంతో, తాము చేతులు పైకెత్తి నడవడం మొదలు పెట్టామని.. చివరకు తాను హాస్టల్ కు చేరుకున్నానని చెప్పింది. ఇంతలోనే కొందరు విద్యార్థులు తమ హాస్టల్ వద్దకు వచ్చి… మహిళా పోలీసులు కొట్టడానికి ఈ హాస్టల్ వద్దకు వస్తున్నారని హెచ్చరించారని… దీంతో, పక్కనే ఉన్న పొదల చాటుకు పరుగెత్తి, తాను అక్కడ దాక్కున్నానని తెలిపింది. ఆ తర్వాత తిరిగి తాను హాస్టల్ కు చేరుకున్నానని… ఈ సందర్భంగా నెత్తురోడుతున్న ఎందరో విద్యార్థులను తాను చూశానని చెప్పింది.