బెంగళూరు: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపింది. ఇటీవల రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటితోపాటు రష్మిక కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న కల్యాణ మండపంలో జరిపిన తనిఖీల్లో రూ.25 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించిన పత్రాలు రష్మిక తల్లిదండ్రులు చూపలేదు. దీంతో ఈనెల 21న బెంగళూరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వీటి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారు.
ఇటీవల కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లా విరాజ్ పేటలోని ఆమె ఇల్లు, కల్యాణ మండపంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నటి రష్మిక మందన్న షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంది. ఈ సోదాల్లో రష్మికకు సొంత కల్యాణ మండపంతో పాటు ప్రకటనల కంపెనీ, ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం ఉన్నట్టు తెలిసింది. అంతే కాకుండా రష్మిక తండ్రి మదన్ మంజన్నా, తల్లి సుమన్ల పేరుతో గత ఒక్క ఏడాదిలోనే కోట్లాది రూపాయలు విలువైన సొత్తు జమ అయిన విషయం వెలుగు చూసింది. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఐటీ సోదాలపై స్పందించిన రష్మిక మేనేజర్ ఆమెకు సంబంధించిన లావాదేవీలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయని ప్రస్తుతం తన తండ్రికి సంబంధించిన లావాదేవీలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
కాగా, ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన రష్మిక…కొద్ది కాలంలోనే అగ్ర హీరోల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం భారీ చిత్రాల్లోనటిస్తోంది. ఇటీవల రష్మిక- మహేష్బాబు కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళంలో వరుస సినిమాలతో రష్మిక బిజీగా ఉంది.