(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గవర్నర్ ఉత్తి కీలుబొమ్మా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇదే ప్రశ్న అడిగాడో పెద్దమనిషి. దేశ రాజకీయాలను గమనించేవారిలో చాలామందికి ఇదే అభిప్రాయం ఉండొచ్చు. అయితేనేం ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న ఉన్నందుకు బీహార్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఫలితంగా ఆ ప్రశ్నాపత్రాన్ని సెట్ చేసిన వ్యక్తిని బీహార్ ప్రభుత్వం పక్కన పెట్టింది.
భారత రాజకీయాలలో గవర్నర్ పదవి పాత్రపై చాలా చర్చ జరిగింది. ఇంకా జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై వివరమైన నివేదిక ఇచ్చిన సర్కారియా కమిషన్ కూడా గవర్నర్ పాత్రను చర్చించింది. చాలా సందర్భాలలో ఆయా రాష్ట్రాలలో గవర్నర్ పాత్ర తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఉదాహరణకు బీహార్లోనే 2005లో ఎన్డిఎ, యుపిఎ రెండు కూటములూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటి గవర్నర్ బూటాసింగ్ శాసనసభ రద్దుకు సిఫారసు చేశారు. ఫలితంగా అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరపాల్సివచ్చింది. గవర్నర్ తీరును అనంతరం సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
ఆదివారం జరిగిన బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో కూడా ఇదే ప్రశ్న అడిగారు. ‘భారతదేశంలో రాష్ట్ర రాజకీయలలో, ముఖ్యంగా బీహార్లో గవర్నర్ పాత్రను విశ్లేషించండి. గవర్నర్ ఉత్తి కీలుబొమ్మేనా’? జనరల్ స్టడీస్లో ఈ ప్రశ్న ఇచ్చారు. ‘మరీ ఎక్కువ సంఖ్యలో పార్టీలు ఉండడం భారత రాజకీయాలకు శాపం. బీహార్ను దృష్టిలో ఉంచుకుని దీనిని విశ్లేషించండి’ అదే పరీక్షలో ఇది మరో ప్రశ్న. పాపం ఆయనెవరో గానీ ఇలాంటి ప్రశ్నలు సెట్ చేసినందుకు మూల్యం చెల్లించుకున్నాడు.