అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల కాలంలో ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజాధనం 2653కోట్ల రూపాయలు దోచుకున్నారని జగన్ దుయ్యబట్టారు.
చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో సంస్కరణలు, రెగ్యులేటరీ యంత్రాంగం తీసుకువచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ దశకు తీసుకువచ్చి కరెంటు కోతలు లేకుండా చేశామన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల వ్యవధిలోనే కరెంటు కోతలు ప్రారంభం అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కర్నాటకలో విద్యుత్ వ్యాపారంలో ఉన్నారనీ, సండూర్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఆ రాష్ట్రానికి విండ్ పవర్ యూనిట్ రూ.4.50లుకు విక్రయిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మాపై బురద చల్లాలని చూస్తే ఈ బురదలో మీరే కూరుకుపోతారు అని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొనుగోలు చేసిన విద్యుత్ ధరలను చంద్రబాబు వివరిస్తూ, పొరుగు రాష్ట్రాలలో చెల్లించే దానికంటే ఎక్కవ ధరకే నేడు వీరు కొనుగోలు చేస్తున్నారనీ, దానికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఐదేళ్లూ పిపిఎలపై సమీక్ష జరిపి ఏమి తేల్చలేక మిన్నకుండిపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటికైనా బురద చల్లే కార్యక్రమం మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. విద్యుత్ రంగంలో 137 అవార్డులు వచ్చిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేసే చర్యల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే రెండు వేల కోట్లు రుణం మంజూరు చేస్తానని ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంక్ కూడా వెనక్కు వెళ్లిపోయిందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికైనా బురద చల్లడం మానుకొని రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా చర్యలు తీసుకుంటే అభినందిస్తామని చంద్రబాబు అన్నారు.
దీనిపై సిఎం జగన్ మాట్లాడుతూ పిపిఎలకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదిక ఇంకా రాలేదని పేర్కొంటూ అప్పుడే చంద్రబాబు అక్కసు వెలిబుచ్చుతున్నాడని విమర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత ప్రభుత్వం మూడేళ్లుగా నిర్వహించిన విద్యుత్ కొనుగోళ్ల వివరాలను జగన్ ప్రదర్శించారు. విద్యుత్ను మన అవసరానికి మించి కొనుగోలు చేయడం, అధిక ధరతో కొనుగోలు చేయడం వల్ల మూడేళ్లలోనే 2653కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా ఏదోఏదో మాట్లాడుతున్నారని జగన్ అన్నారు.
ధర్మల్ పవర్ తక్కువ ధరకు లభ్యమవుతున్నా కొనుగోలు చేయకుండా గత ప్రభుత్వం పవన విద్యుత్తును అగ్రిమెంట్ చేసుకున్న ధర ప్రకారం రూ.4.84లకు కొనుగోలు చేశారని జగన్ విమర్శించారు. కేవలం మూడు కంపెనీలతో 63శాతం విండ్ పవర్ అగ్రిమెంట్లు చేసుకొని, దారుణంగా స్కామ్లు చేసి ఏమి ఎరగనట్లు, ఏమి చేయనట్లు ఇక్కడ మాట్లాడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. ఇలా మాట్లాడుతున్న వీరిని మనుషులు కాదు రాక్షసులు అని అనాలి అంటూ జగన్ వ్యాఖ్యానించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సభను సోమవారానికి వాయిదా వేశారు.