పాట్నా: మోటార్ సైకిల్ చోరీ చేశాడన్న అనుమానంతో 24 ఏళ్ల తబ్రేజ్ అన్సారీని జార్ఖండ్లో స్తంభానికి కట్టేసి రాత్రంతా కొడుతూనే ఉన్నారు. చావ చితకబాదుతూ అతనితో జై శ్రీరాం అనిపించారు. నాలుగు రోజుల తర్వాత తబ్రేజ్ అన్సారీ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ దారుణానికి కారకులైన వారిపై ఇప్పుడు హత్యభియోగం మోపలేదు. కారణం అన్సారీ గుండెపోటుతో మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో రావడమే. అందుకని అన్సారీ మృతికి కారకులైన వారిపై శిక్షార్హమైన వధకు (culpable homicide) పాల్పడ్డారన్న అభియోగం మోపి చార్జ్షీట్ దాఖలు చేశారు.
జూన్ 18వ తేదీన అన్సారీని చావబాదినందుకు మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటనను మొబైల్లో చిత్రించడంతో ఈ దారుణం గురించి ప్రపంచానికి తెలిసింది. హత్య చేశారనేందుకు మెడికల్ రిపోర్టు సహకరించడంలేదని జార్ఖండ్ సీనియర్ పోలీసు అధికారి కార్తీక్ ఎన్డిటివితో అన్నారు. వైద్యపరీక్ష రిపోర్టు రాగానే మరో వైద్యనిపుణుల బృందం అభిప్రాయం కూడా తీసుకున్నామనీ, వారు కూడా అన్సారీ మృతికి కార్డియాక్ అరెస్టు కారణమని చెప్పారనీ ఆయన అన్నారు.
అన్సారీ మృతికి పోలీసులు, వైద్యులు కూడా బాధ్యులేనని ఒక విచారణ బృందం తేల్చింది. ఈ సంఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం సరైకేలా కార్వాన్ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీ నియమించింది. తబ్రేజ్ అన్సారీని మూక చావబాదుతోందన్న సమాచారం అందిన తర్వాత పోలీసులు అక్కడికి సకాలంలో వెళ్లలేదనీ, అన్సారీని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత అతనికి తలలో తగిలిన దెబ్బలను వైద్యులు గుర్తించలేదనీ ఆ కమిటీ తేల్చింది.