అమరావతి: పల్నాటిసీమ కేంద్రంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్య రాజకీయ వేడి కొనసాగుతొంది. చంద్రబాబు ప్రకటించిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పోటీగా వైసిపి కూడా అలాంటి కార్యక్రమమే ప్రకటించడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పలువురు టిడిపి కార్యకర్తలను హత్య చేశారనీ, వందలాది మంది టిడిపి శ్రేణులపై భౌతికదాడులకు పాల్పడ్డారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వైసిపి దాడులకు భయపడి పల్నాటి సీమలో గ్రామాలను వదిలిపెట్టి వెళ్లిన టిడిపి శ్రేణుల కోసం టిడిపి ఆధ్వర్యంలో గుంటూరులో పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పల్నాడులో శాంతి భద్రతలను పరిరక్షించాలనీ, టిడిపి శ్రేణులకు గ్రామాల్లో రక్షణ కల్పించాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తగిన రక్షణ చర్యలతో బాధితులను గ్రామాలకు తరలించాలని లేకుంటే తానే స్వయంగా బాధిత కుటుంబాలను గ్రామాలకు తీసుకువెళతానని పేర్కొన్న చంద్రబాబు ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు నిచ్చారు.
ఈ నేపథ్యంలో టిడిపి అరోపణలను వైసిపి కొట్టిపారేస్తోంది. వైసిపి బాధితులు అంటూ టిడిపి అసత్య ప్రచారం చేస్తోందని అధికారపక్ష నేతలు పేర్కొంటున్నారు. గత ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పల్నాటి సీమలో ఎంతో మంది వైసిపి కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని వైసిపి నేతలు పేర్కొంటున్నారు. టిడిపికి పోటీగా పిడుగురాళ్లలో వైసిపి బాధిత కుటుంబాల కోసం పునరావాస కేంద్రాన్ని అధికార పక్షం నేతలు ఏర్పాటు చేశారు. అధికార, విపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పల్నాటి సీమలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టిడిపి బాధితులతో తాము రేపు చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపడుతున్నామని వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. పెయిడ్ ఆర్టిస్ట్లతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని అంబటి విమర్శించారు. టిడిపి హయాంలో పల్నాడులో దారుణాలు జరిగాయనీ, వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడు ప్రశాంతంగా ఉందనీ అంబటి పేర్కొన్నారు.
పల్నాడు ప్రస్తుతం ప్రశాంతంగా ఉందనీ, రాజకీయాల కోసం చంద్రబాబు పల్నాడులో చిచ్చు పెట్టవద్దనీ వైసిపి ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడులు విజ్ఞప్తి చేశారు. తాము టిడిపి బాధితులను తీసుకువస్తాం, చంద్రబాబు చర్చకు రావాలని వారు కోరారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.
టిడిపి చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసిపి చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అని వేచి చూడాల్సి ఉంది.
కాగా చంద్రబాబు చలో ఆత్మకూరు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరించారు. మంగళవారం మోహరం, మరో వైపు వినాయక నిమజ్జనాలు జరుగుతున్న కారణంగా 144 సెక్షన్ విధించినట్లు అధికారులు చెబుతున్నా టిడిపి చలో ఆత్మకూరు నియంత్రణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. పల్నాడు ప్రాంతం నుండి 70 కుటుంబాల వారు ఇతర ప్రాంతాలకు వెళ్లారని పోలీసులు గుర్తించారు. వీరిలో ఇప్పటికే 14 కుటుంబాల వారిని గ్రామాలకు తీసుకువెళ్లారు. మిగతా వారిని కూడా గ్రామాలకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా పోలీసు, రెవెన్యూ అధికారులు సోమవారం గుంటూరు టిడిపి పునరావస శిబిరం వద్దకు వెళ్లారు. గ్రామాలకు వెళితే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే శిబిరంలో ఉన్న వారు మంగళవారం పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించి గ్రామాలకు వస్తామని చెప్పారని రూరల్ ఎఎస్పి చక్రవర్తి తెలిపారు.
మరో వైపు చలో ఆత్మకూరుకు టిడిపి శ్రేణులు సమాయత్తం అవుతుండగా దీన్ని భగ్నం చేసేందుకు అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎక్కడివారిని అక్కడ నియంత్రించాలని భావిస్తోంది. గుంటూరు నుండి నర్సరావుపేట, నర్సరావుపేట నుండి పిడుగురాళ్ల, కారంపూడి, గుంటూరు – పిడుగురాళ్ల, అమరావతి – పిడుగురాళ్ల మార్గాలలో ముందస్తుగా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
గుంటూరు పునరావస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతున్న పోలీస్ అధికారి