అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్కు తలనొప్పిగా మారనున్నాయి. యువ ముఖ్యమంత్రి జగన్ తనదైన ఫందాతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వాలు చేయని సాహస నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.
మ్యానిఫెస్టోలో పెట్టకపోయినా, ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వకపోయినా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని చర్చిల పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించారు. పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ప్రోత్సాహకంగా 15వేల రూపాయల వంతున అమ్మఒడి పథకం ద్వారా ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రోడ్డు రవాణా సంస్థ (ఆర్టిసి)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆర్టిసి కార్మికుల దశాబ్దాల కల. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేయని ఈ పథకాలను జగన్ అమలులోకి తీసుకువస్తున్నారు.ఈ నిర్ణయాల ప్రభావం పక్కనున్న తెలుగురాష్ట్రంపై కూడా పడుతుందని అంటున్నారు.
ఇప్పటికే ఇక్కడ ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తుండటంతో తెలంగాణలో టిఎస్ ఆర్టిసి యూనియన్ నేతలు ఆ డిమాండ్ చేస్తున్నారు. బిజెపి నేతలు కూడా టిఎస్ ఆర్టిసి కార్మికులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలకు అక్కడ కూడా అమలు చేయాలని ఆయా వర్గాలు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి టిఎస్ ఆర్టిసి ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆయన కూడా ఈ బాటనే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే టిఆర్ ఆర్టిసి కార్మికులు ఆందోళన బాట పట్టే ప్రమాదం ఉంది.
రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలోని చర్చి ఫాదర్లు గౌరవ వేతనం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అంగన్వాడీలు, ఆశ వర్కర్లు కూడా ఆంధ్రలో పెంచిన మాదిరిగానే వేతనాల పెంపు చేయాలని కోరే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ ధనిక రాష్ట్రం కావడం వల్ల పథకాల అమలుకై ఆయా వర్గాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసే అవకాశం ఉంది. వీటికి తోడు ఆంద్రప్రదేశ్ నుండి పొరుగు రాష్ట్రాలకు ఇసుక రవాణా నిషేదించారు. ఇది హైదరాబాదుకు చాలా ఇబ్బందికరమైన అంశమే.