హైదరాబాద్: హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఆషామాషీ గెలుపు కాదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు అద్భుత విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి ఈ గెలుపు ఓ టానిక్ లాంటిదని, ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. హుజూర్నగర్ ఉపఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన సభకు తాను హాజరుకాలేకపోయానని గుర్తుచేసుకున్నారు. ఇంత అద్భుత విజయాన్ని అందించిన ప్రజల కోసం ఎల్లుండి హుజూర్నగర్లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని చెప్పారు.
ఉపఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల పార్టీలు చాలారకాల దుష్ప్రచారాలు, చాలా నీలాపనిందలు వేశారని చెప్పారు. అయితే, నియోజకవర్గ ప్రజలు వాటన్నింటిని పక్కనపెట్టి తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని 43 వేల మెజార్టీ పైచిలుకుతో గెలిపించారన్నారు. గతంలో అదే స్థానాన్ని తాము ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయామని గుర్తు చేశారు. ఇప్పుడు 50 శాతం ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని ఆశీర్వదించారని తెలిపారు. హుజూర్నగర్ ప్రజలు ఏఏ ఆశలు, నమ్మకాలు పెట్టుకుని టీఆర్ఎస్ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని సీఎం స్పష్టం చేశారు.