అమరావతి: జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలతో ఇప్పటికే చికాకు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి మరొక వ్యతిరేక కధనం వచ్చింది. అనంతపురం జిల్లాలో గత డిసెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించిన’ కియా’ కార్ల కంపెనీ.. ఫ్యాక్టరీ మొత్తాన్ని తమిళనాడుకు తరలించే ఆలోచన చేస్తున్నట్లు రాయిటర్ వార్త కధనం లో పేర్కొన్నది. ఇక దీన్ని లైవ్ మింట్ వెబ్ సైట్ ప్రచురించింది. అయితే ఇది వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం స్పందించింది. లైవ్ మింట్ లో వచ్చిన కధనం పూర్తిగా అవాస్తవమనీ, ఈ వెబ్ సైట్, టిడిపి కుమ్ముక్కై ఇలాంటి వ్యవహారాలు నడుపుతుతున్నారనీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ ఒక ప్రకటనలో వివరించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రైవేట్ పరిశ్రమల్లోనూ యాజమాన్యాలు 75 శాతం స్థానికులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసికొని దానికి అనుగుణంగా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీనికి తోడు కియా ఫ్యాక్టరీని ప్రోత్సహించేందుకు గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూ కేటాయింపులు, ఇతర రాయితీలను జగన్ ప్రభుత్వం పునః సమీక్ష చేయాలనీ భావిస్తుందనీ, ఈ విషయం తెలిసి జపాన్ ప్రభుత్వం ఆలా చేయవద్దని జగన్ ప్రభుత్యానికి లేఖ రాసిందని రాయిటర్ వార్త సంస్థ పేర్కొన్నది. ఏపి ప్రభుత్వ చర్యల కారణంగా కియా పరిశ్రమను తమిళనాడుకు తరలించాలి నిర్ణయం తీసుకొని అక్కడి ప్రభుత్వంతో చర్చలు నడిపిందనీ సీనియర్ అధికారులు చెప్పినట్లు వెబ్ సైట్ లో ప్రచురించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ సిఎంఒ, తమిళనాడు సిఎంఒలను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారని వెబ్ సైట్ కధనంలో పేర్కొన్నది.
అయితే ఈ కధనం వచ్చిన వెంటనే ఏపి ప్రభుత్వం స్పందించి దాన్ని ఖండించింది.
ఈ కధనంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఖండించారు.