కర్నూలు: చిన్న వయస్సులోనే రెవెన్యూ శాఖలో ఉద్యోగం పొందిన ఆమె.. ఇప్పుడు ఒక మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, కానీ ఆమె చేసిన ఘన కార్యం కారణంగా పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యాశకు పోయి అవినీతికి పాల్పడటంతో ఇల్లు వాకిలీ వదిలి ఎక్కడో అజ్ఞాతంలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఎదురయ్యింది.
ఆమె పేరు హసీనాబీ, సొంతూరు నంద్యాల మండలం పొన్నాపురం. 2012లో రెవెన్యూ శాఖలో డిప్యూటి తహశీల్దార్గా చేరిన ఆమె వెలుగోడు, నంద్యాల, ఆలూరు, కర్నూలులో పని చేశారు. ఏడాది క్రితం తహశీల్దార్గా పదోన్నతి పొందారు. ఆరు నెలల పాటు కలెక్టరేట్లో పని చేసిన హసీనాబీ ఈ ఏడాది జూలై 15న గూడూరు తహశీల్దార్గా బాధ్యతలు చేపట్టారు.
భూసమస్య పరిష్కారం కోసం ఓ వ్యక్తి నుండి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో అతను అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ సూచనల మేరకు పాణ్యం బస్టాండ్లో ఒక ప్రైవేటు వ్యక్తికి బాధితుడు లంచం డబ్బులు నాలుగు లక్షల రూపాయలు ఇస్తుండగా ఏసిబి అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతన్ని డిఎస్పి నాగభూషణం విచారించగా తన పేరు మహబూబ్ బాష అని, తహశీల్దార్ హసీనాబీ సూచనల మేరకు డబ్బులు తీసుకున్నాననీ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో తహశీల్దార్తో పాటు అతనిపైనా కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు. హసీనాబీని అరెస్టు చేసేందుకు ఎసిబి అధికారులు ప్రయత్నించగా ఆమె ఆచూకి లభించలేదు. విషయం పసిగట్టిన ఆమె పరారీలో ఉంది. ఏసిబి కేసులో ముద్దాయిగా ఉన్న హసీనాబీకి ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపైనా కేసు నమోదు చేస్తామని డిఎస్పి హెచ్చరించారు. అత్యాశకు పోయి అవినీతికి పాల్పడటం వల్ల ఆమెకు నేడు ఆత్మీయులు, సన్నిహితులు సైతం ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది.