ఢిల్లీ: ఆంధ్రప్రేదేశ్లో మళ్ళీ టిడిపిదే అధికారమని లోక్నీతి-సిఎస్డిఎస్ సర్వేలో వెల్లడయినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజంలేదని లోక్నీతి-సిఎస్డిఎస్ సంస్థ వెల్లడించినది.
‘తాము ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సర్వే చేపట్టలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వారల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తమ సర్వే పేరుతో ప్రచారమవుతన్నదంతా ఫేక్ అని, పూర్తిగా అసంబద్ధమైనదని’ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. సర్వేపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో లోక్నీతి-సిఎస్డిఎస్ సంస్థ సోమవారం ఈ మేరకు స్పందించినది.
ఏబిపి చానల్ కోసం లోక్నీతి-సిఎస్డిఎస్ సర్వే నిర్వహించిందనీ, సర్వే ప్రకారం టిడిపి 126 నుంచి 135 అసెంబ్లీ సీట్లు, 18 నుంచి 22 లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందనీ పేర్కొంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కథనాన్ని ప్రచురించినది. వైసిపికి 45 నుంచి 50 స్థానాలు, జనసేనకు 3 నుంచి 5 స్థానాలు దక్కుతాయనీ, బిజెపి, కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదనీ సర్వేలో వెల్లడయినట్టు కథనంలో పేర్కొన్నది.
ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు నమోదు అవ్వుతాయి అనేది కూడా ఆంధ్రజ్యోతి పత్రిక వివరించినది. టిడిపికి 46.2 శాతం ఓట్లు, వైసిపికి 37.2 శాతం ఓట్లు లభిస్తాయని లోక్నీతి-సిఎస్డిఎస్ సర్వేలో తేలినట్టు పేర్కొన్నది. మార్చి 11 నుంచి 19 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 26,764 మంది పాల్గొంటే, వీరిలో 12,029 మహిళలు ఉన్నట్టు, అన్ని వయసుల ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఆంధ్రజ్యోతి ఆ కథనంలో వివరించినది.
లోక్నీతి-సిఎస్డిఎస్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆ కథనంపై స్పందించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన మాదిరిగా తాము ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సర్వే నిర్వహించలేదని ఫేస్బుక్లో పేర్కొన్నారు. దీన్ని ఖండిస్తున్ననీ, దీనిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామనీ తెలిపారు. ఆ కథనంతో లోక్నీతి-సిఎస్డిఎస్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.