(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నది. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొట్టి.. అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మాఫియాతో కుమక్మైన తెలంగాణ రాష్ట్రఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండిసీ) అధికారులు వంద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు స్వయానా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీపీ. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ కు ఓ లేఖను రాశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవవూర్ లోని గోదావరి నది తీరం వెంట వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన 23 ఇసుక రీచ్ ల నుండి నిరంతరం వేలాది లారీల ద్వారా ఇసుకను పొరుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని మహాదేవపూర్ ఎంపీపీ బన్సోడ రాణిబాయి ఆరోపించారు. లారీలతో పరిమితికి మించి ఇసుకను అనధికారికంగా నింపుతూ, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఇసుక కాంట్రాక్టర్లతో టీఎస్ఎండీసీ అధికారులు కుమ్మకై ప్రతినెల ప్రభుత్వ ఖజానాకు సుమారు వంద కోట్ల వరకు నష్టం చేస్తున్నారని తెలిపారు. ఈ ఇసుక మాఫియాను కట్టడి చేసి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని అవినీతి సొమ్మును రికవరి చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేల చర్యలు తీసుకోవాలని గర్నవర్ కు రాసిన లేఖలో ఎంపీపీ రాణిబాయి కోరారు.
అధికారపార్టీకి చెందిన ఎంపిపినే ఇసుక మాఫియాపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలో గోదావరి నదీ ఇసుక తవ్వకాలకు నిలయాలుగా మారాయి. అక్రమార్కులకు అధికారుల అండదండలు ఉండటంతో అక్రమ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులు కోట్లాది రూపాయలకు పడగలెత్తుతున్నారు. అధికారులు చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం ఇసుకను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే తవ్వాలి. ఆ సమయంలో కచ్చితంగా సీసీ కెమెరాల నిఘా ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు రాత్రింబవళ్లు 24 గంటలపాటు తవ్వకాలు సాగిస్తున్నారు సదరు ఎంపిపి లేఖలో స్పష్టం అవుతోంది. లారీల్లో ఇసుక నింపడంలోనూ నిబంధనలు ఉన్నాయి. పది పన్నుల కెపాసిటీ గల లారీలో ఆరు క్యూబిక్ మీటర్లు ఇసుకను, 17 టన్నుల లారీలో పది క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపాల్సి ఉంటుంది. కానీ ఇసుక మాఫియా మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.