న్యూఢిల్లీ: ఆమ్రపాలి ప్రాజెక్టులో పెంట్ హౌస్ తనకు అప్పగించాలని, అలాగే కంపెనీ క్రెడిటార్ల జాబితాలో తన పేరునూ చేర్చాలని కోరుతూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీ వెంచరులో తాను పెంట్ హౌస్ బుక్ చేసుకన్నట్లు ధోనీ కోర్టుకు తెలిపారు. తర్వాత ఆమ్రపాలి గ్రూపు తనను వాళ్ల ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వాడుకుందన్నారు. ఆ విషయంలో తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా మసం చేశారని, అలాగే పెంట్ హౌస్ కూడా అప్పగించలేదని చెప్పారు.
బ్రాండ్ అంబాసిడర్ గా కంపెనీకి చేసిన సేవలకు గాను రూ. 40 కోట్లు చెల్లించాల్సిందిగా ఆమ్రపాలి గ్రూపును ఆదేశించాలని ధోనీ సుప్రీంకోర్టును కోరారు. 2009 నుంచి 2016 వరకు ఈ కంపెనీకి ధోని ప్రచారం చేశారు. పలు ప్రకటనలలో ఆయన కనిపించారు. తర్వాత ఆమ్రపాలి గ్రూపు నష్టాల్లో కూరుకుపోయింది. దాంతో ఇప్పటికే ప్లాట్ల కోసం తాము చెల్లించి మొత్తం విషయమై దాదాపు 46 వేల మంది యజమానులు కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.
ధోనీ ఆమ్రపాలి గ్రూపు ప్రచారకర్తగా ఉండగా, ఆయన భార్య సాక్షి కూడా ఆ గ్రూపు చారిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమ్రపాలి గ్రూపు, దాని అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లకు సంబంధించిన ఆస్తులన్నింటినీ అటాచ్ చేయాలని కోర్టు అంతకుముందు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఆగిపోయిన రెండు ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలోని ఎన్.బి.సి.సి. పూర్తిచేయాలని జనవరి 25న సూచించింది. ఆమ్రపాలి గ్రూపు సీఎండీ అనిల్ శర్మ, ఇద్దరు డైరెక్టర్లు శివ్ దీవాని, అజయ్ కుమార్ లను ఫిబ్రవరి 28 నుంచి పోలీసు కస్టడీకి పంపింది.