న్యూఢిల్లీ: దేశంలోని కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండ్రస్టీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరో మారు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఈ స్థానంలో నిలవడం వరుసగా ఇది ఎనిమిదవ సారి. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. 3,80,700 కోట్ల రూపాయల సంపదతో ముఖేష్ తొలి స్థానంలో నిలవగా ఎస్పి హిందూజా అండ్ ఫ్యామిలీ లక్షా 1,86,500 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో, విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్జీ 1,17,100 కోట్ల రూపాయలతో మూడవ స్థానంలో నిలిచారు.
ఆ తరువాత వరుసగా 1,07,300 కోట్ల రూపాయలతో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్, సిఇఒ ఎల్ ఎన్ మిట్టల్, 94,500 కోట్ల రూపాయలతో గౌతమ్ ఆదాని, 94,100 కోట్ల రూపాయలతో కొటక్ మహేంద్ర బ్యాంక్ సారధి ఉదయ్ కొటక్, 88,800 కోట్ల రూపాయలతో సైరస్ మిస్త్రీ, 76,800 కోట్ల రూపాయలతో సైరస్ పల్లోంజి మిస్త్రీ, 76,800 కోట్ల రూపాయలతో షాపుర్జీ పల్లోంజి, 71,500 కోట్ల రూపాయలతో దిలీప్ సంఘ్వీలు పదవ స్థానం వరకూ నిలిచారు.
ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు 74 మంది చోటుదక్కించుకున్నారు. టాప్ 100లో ఐదుగురు తెలుగు పారిశ్రామికవేత్తలు ఉన్నారు.
దేశంలో 2018 సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నికర విలువ కల్గిన సంపన్నులు 831మంది ఉండగా 2019 సంవత్సరంలో వీరి సంఖ్య 953కు పెరిగింది.
అమెరికా డాలర్ పరంగా చూస్తే మాత్రం ఈ సంఖ్య 141 నుండి 138కి తగ్గింది. ఈ జాబితాలోని టాప్ 25మంది లక్ష్మీపుత్రుల ఉమ్మడి సంపద దేశ జిడిపిలో పది శాతానికి సమానం కాగా 953 మంది వాటా 27 శాతంగా ఉంది.