హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ శుక్రవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగింది. ఈ కేసులో గత శుక్రవారం(జనవరి 10) విచారణకు హాజరైన జగన్.. నేటి విచారణకు మాత్రం ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఈ కేసులో ఏ2గా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ గతంలో పిటిషన్ వేశారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి. ఈ కేసు విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపును కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈడీ కేసుల్లో జగన్కు వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ వైసీపీ వర్గాల్లో నెలకొంది.
అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం గత శుక్రవారం(జనవరి 10) ఏపీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు అయిన సంగతి తెలిసిందే. సీఎం హోదాలో తొలిసారిగా జగన్ కోర్టుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. పాలనాపరమైన అంశాలతో జగన్ బిజీ అయ్యారు. దీంతో కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు ముందుగానే కోర్టుకు నివేదించారు. ఆయన తరఫున లాయర్లు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసి అనుమతి తీసుకుంటున్నారు. అయితే, వరుసగా హాజరు కాకపోవడం వల్ల విచారణపై ప్రభావం చూపుతోందంటూ సీబీఐ తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిసారి మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో జనవరి 10న కోర్టుకు తప్పనిసరిగా జగన్, విజయసాయిరెడ్డి హాజరు కావాల్సిందేనని కోర్టు వారిద్దరి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది. దీంతో జగన్ కోర్టుకు హాజరైయ్యారు.