ముంబయి: మహారాష్ట్ర ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోది ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్సిపి అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఈ తీరు ఒక్క మహారాష్ట్రకే పరిమితం కాలేదనీ, అన్ని రాష్ట్రాలలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తోందని శరద్ పవార్ పేర్కొన్నారు. బిజెపిలో చేరాల్సిందిగా ప్రతిపక్ష పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, మూడు రోజుల క్రితం ముంబయి ఎన్సిపి అధ్యక్షుడు సచిన్ ఆహిర్ ఎన్సిపిని వీడి శివసేనలో చేరారు. ఎన్సిపి మాజీ ఎమ్మెల్యే కళ్యాణ్ కాలే పార్టీని వీడి బిజెపిలో చేరారు. మాజీ మంత్రి, సీనియర్ ఎన్సిపి నేత మధుకర్ పిచాద్ కుమారుడు ఎమ్మెల్యే వైభవ్ పిచాద్ పార్టీని వీడి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సిపి మహిళ విభాగం రాష్ట్ర నేత చిత్ర వార్గ్ కూడా ఎన్సిపిని వీడారు.
ఈ నేపథ్యంలో ఎన్సిపి అధినేత శరద్ పవార్ బిజెపిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే కళ్యాణ్ కాలే షుగర్ ఫ్యాక్టరీ క్లిష్టపరిస్థితుల్లో ఉంటే ఫడ్నవీస్ ప్రభుత్వం దానికి 30నుండి 35కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆయనను పార్టీలో చేరాలని కోరిందన్నారు. దీంతో అతను పార్టీ మారిపోయాడని ఆరోపించారు. అయితే శరద్ పవార్ ఆరోపణలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండిస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం అనేక చక్కర కర్మాగారాలకు ఆర్థిక సహాయం అందించిందనీ అందులో భాగంగానే కళ్యాణ్ కాలే షుగర్ షాక్టరీకి కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. దీనికి ప్రతిఫలంగా పార్టీలో చేరమని ఎవరినీ అడగలేదని ఫడ్నవీస్ తెలిపారు. ఈ పరిస్థితులపై ముందుగా శరద్ పవార్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు.