న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు భయం లేకుండా మాట్లాడే రాజకీయ నాయకుల అవసరం ప్రస్తుతం దేశానికి ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో మంగళవారం ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ విబేధాలతో నిమిత్తం లేకుండా జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై చర్చించడం అన్నది దేశంలో దాదాపు అంతర్ధానమైపోయిందనీ, ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలనీ జోషి అన్నారు. ప్రధాని మోదీ ఏమనుకుంటారో అని సందేహించకుండా ఆయన ముందు తన అభిప్రాయాలు నిర్భయంగా చెప్పి, సిద్ధాంతపరంగా చర్చించగలిగిన నాయకుల అవసరం ఉంది అని జోషి అన్నారు. ఈ సభలో జోషితో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
#WATCH: Murli Manohar Joshi, senior BJP leader says,"I think there is a need for such a leadership today which expresses views clearly, can debate with the Prime Minister based on principles, without any inhibition and not worrying about making him happy or sad." (3/9) pic.twitter.com/Yk59BRnky0
— ANI (@ANI) September 4, 2019
బిజెపి నాయకత్వం పట్ల తన అసంతృప్తిని ఇంతకుముందు జోషి బహిరంగంగానే వెలిబుచ్చారు. గత ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి ప్రకటించారు. నరేంద్ర మోదీ – అమిత్ షా హయాంలో అద్వానీతో పాటు జోషీ కూడా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.