(న్యూస్ అర్బిట్ బ్యూరో)
ఎంపిడిఓ సరళ ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి పాల్పడిన నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి ఆ వెంటనే బెయిల్పై విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే విడిచిపెట్టేదానికి అరెస్టు చేయడం అవసరమా అని పంచాయితీ రాజ్ శాఖ ఉద్యోగవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
సరళ లేని సమయంలో అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి అక్కడ వృద్ధురాలైన ఆమె తల్లిని భయభ్రాంతులకు గురిచేసి కేబుల్ కట్ చేసి, నీటి పైపు కూడా కట్ చేస్తామని బెదిరించి ఇంటి ముందు నానా భీభత్సం సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నిజానికి ఫిర్యాదు చేసేందుకు సరళ పోలీస్ స్టేషన్కు వెళ్లినపుడు సిఐ, ఎస్ఐ మొహం చాటేశారు. ఆమె తెల్లవారుఝామున నాలుగింటి వరకూ అక్కడే బైఠాయించడం, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం రావడంతో పోలీసు అధికారులు తప్పని పరిస్థితులలో స్టేషన్కు వచ్చారు.
రెండవ రోజున ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ నుంచి రాగానే, ఈ విషయంపై దృష్టి సారించారనీ, తప్పు చేసిన వారు ఎవరైనా చర్య తీసుకోవాలంటూ డిజిపిని ఆదేశించారనీ వార్తలు వెలువడ్డాయి. దానికి తగ్గట్లే శాసనసభ్యుడు కోటంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. తీరా చూస్తే అన్నీ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. మెజిస్ట్రేట్ వెంటనే విడుదల చేశారు. దీనితో ప్రజల్లో పోలీసులు కావాలనే పెద్ద బిల్డప్ ఇచ్చి నాటకం ఆడారన్న అభిప్రాయం కలిగింది.
గతంలో చంద్రబాబు హయాంలో దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఇలానే ఎమ్మార్వో వనజాక్షిపై దౌర్జన్యం చేశారు. అప్పుడు రెవిన్యూ ఉధ్యోగులు తీవ్రంగా స్పందించారు. అయినా శాసనభ్యుడిపై చర్య తీసుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభాకర్పై చర్య తీసుకోకుండా రాజీ చేశారన్నది అప్పటినుంచీ ఆయనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. జగన్, పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలలో ఈ విమర్శ చేశారు.
ఇప్పుడు వైసిపి ప్రభుత్వంలో అదే విమర్శ ముఖ్యమంత్రి జగన్పై రాకుండా చూసేందుకు కోటంరెడ్డిని అరెస్టు చేసినట్లు పెద్ద ప్రహసనం జరిపించారని పంచాయత్ రాజ్ ఉద్యోగులు అంటున్నారు. ఎంపిడివో ఇంటి దగ్గర కోటంరెడ్డి సృష్టించిన అరాచకంలో పోలీసులుకు నాన్ బెయిలబుల్ నేరం ఒక్కటీ కనబడకపోవడంలోని పరమార్ధం తెలియనంత అమాయకులు ఎవరూ ఉండరని నెల్లూరు జిల్లా పంచాయత్ రాజ్ ఉద్యోగసంఘం నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.