హైదరాబాదు: హైదరాబాదులో మరో సారి ఉగ్రవాదుల సానుభూతిపరుల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు తనిఖీలు చేపట్టడం స్థానికుల్లో కలవరాన్ని కల్గిస్తోంది.
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్స్ కాలనీ, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు గత రాత్రి నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో ఎన్ఐఎ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గతంలో పట్టుబడిన బాసిత్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కింగ్స్ కాలనీలో ఉగ్రవాద కోణంలో ఎనిమిది మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. పలువురుని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
హైదరాబాదుకు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించారు. రెండేళ్ల క్రితం ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాదు కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందు కోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసేందుకు కుట్రలు పన్నారనీ ఈ మేరకు వారికి ఐసిస్ నుండి ఆదేశాలు అందాయని తెలుస్తోంది.
ఆర్ఎస్ఎస్ నాయకుడిని హత్య చేసేందుకు ఢిల్లీ వెళ్లిన బాసిత్, మరో నలుగురు యువకులకు ఎకె 47లను ఐసిస్ సమకూర్చినట్లు సమాచారం. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్టు చేయడంతో ఆ ప్లాన్ విఫలమయ్యింది. ఈ నేపథ్యంలో బాసిత్ హైదరాబాదు కు తిరిగి వచ్చేశాడు. హైదరాబాదులో బాసిత్తో పాటు మరో ఇద్దరిని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేశారు.