న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరితీయనున్న నేపథ్యంలో చివరి కోరికపై వారు మౌనం వహించారు. ఏడేళ్ల క్రితం నాటి ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయడానికి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉరిశిక్ష అమలు దగ్గర పడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా? అని అధికారులు దోషులను అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ మేరకు తీహార్ జైలు వర్గాలు తెలిపాయి.
నిబంధనల ప్రకారం మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని లేదా తమ ఆస్తిని ఎవరికైనా వదిలేయాలనుకుంటున్నారా? అని కూడా అడుగుతారు. అయితే ఈ రెండు విషయాలపై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. నిందితులు ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలు మౌనంగా ఉన్నారు. ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోందని జైలు అధికారులు పేర్కొన్నారు.
నిజానికి బుధవారమే(జనవరి 22) ఈ నలుగురు దోషులను ఉరిశీయాల్సి ఉండగా.. క్షమాభిక్ష అభ్యర్థన కారణంగా ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. దోషుల్లో ఒకడైన ముఖేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోవడంతో వీరి శిక్ష అమలు తేదీ వాయిదా పడింది. ముఖేశ్ అభ్యర్థననను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో ఢిల్లీ కోర్టు ఇటీవలే కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషులను ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ఇద్దరు దోషులు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ జనవరి 9న తమకున్న చిట్ట చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై జనవరి 14 ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను కొట్టివేసింది. దీంతో నిర్భయ దోషులకు జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయాలని భావించారు. అప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, క్షమాభిక్ష కోరుతూ ముఖేశ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అభ్యర్థన సమర్పించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఉరిశిక్ష అమలు జరగదని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషులు క్షమాభిక్ష పిటిషన్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. కేవలం దోషి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాతే మరణ శిక్ష అమలుపై తుది నిర్ణయం వుంటుందని తెలిపింది. అప్పటివరకు నలుగురు దోషులలో ఎవరినీ జనవరి 22న ఉరితీయలేమని స్పష్టం చేసింది. ముఖేశ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిస్కరించడంతో ఉరిశిక్ష అమలుపై జనవరి 17న కొత్త తేదీ ఖరారు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13 రోజుల పాటు పోరాడిన నిర్భయ.. డిసెంబర్ 29న ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్, వినయ్ శర్మ, పవన్, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ప్రస్తుతం నలుగురు దోషులు ఢిల్లీలోని తీహార్ జైలులోఉన్నారు.