(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిఐడి కేసు నమోదు చేసింది. 796 మంది తెల్ల రేషన్ కార్డుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మూడు కోట్ల రూపాయల చొప్పున వంద ఎకరాలను తెల్ల రేషన్ కార్డుదారులు కొనుగోలు చేసినట్లు సిఐడి నిర్ధారణకు వచ్చింది. 131మంది తెల్లరేషన్ కార్డుదారులు మొత్తం 129 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పెదకాకానిలో 43మంది 40 ఎకరాలు, తాడికొండలో 188మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238మంది 243 ఎకరాలు, తాడేపల్లిలో 49మంది 24 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు కొన్నట్లు సిఐడి గుర్తించింది. ఇద్దరు టిడిపి మాజీ మంత్రులపై కూడా కేసులు పెట్టినట్లు సమాచారం. అసలు కొనుగోలుదారులు ఎవరనేదానిపై సిఐడి విచారణ జరపనున్నది.
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్సైడర్ ట్రైడింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టిన తీర్మానానికి నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రాధమికంగా 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. అయితే ఇప్పటికే సిఐడి అధికారులు గ్రామాల్లో భూముల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రాధమిక విచారణ పూర్తి చేశారు.