విమర్శలపై గడ్కరీ వ్యాఖ్యలు
జాతి వ్యతిరేకులు కాదని వెల్లడి
న్యూఢిల్లీ: విమర్శకులను బీజేపీ ఎప్పుడూ జాతివ్యతిరేకులుగా చూడలేదని పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ అన్న కొన్ని రోజులకే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా దాదాపు అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలను మనం గౌరవించాలని, ఎందుకంటే ఇదే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన ఎన్డీటీవీతో మాట్లాడుతూ చెప్పారు. గాంధీనగర్ టికెట్ దక్కకపోవడంతో చాలాకాలం మౌనంగా ఉన్న అద్వానీ, తర్వాత తన బ్లాగులో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వ్యాఖ్యానించాలని గడ్కరీని పాత్రికేయులు కోరినప్పుడు ఆయనిలా అన్నారు. ‘‘పార్టీ ప్రారంభం నాటి నుంచి బీజేపీ ఎప్పుడూ తమతో రాజకీయంగా విభేదించేవాళ్లను శత్రువులగా భావించలేదు… కేవలం భిన్నాభిప్రాయంగానే తీసుకుంది. భారత జాతీయవాదంలో, మనతో రాజకీయంగా విభేదించేవాళ్లను జాతివ్యతిరేకులుగా భావించలేదు’’ అని అద్వానీ రాశారు.
దీనిపైనే గడ్కరీ స్పందించారు. ‘‘మాతో లేనివాళ్లను జాతి వ్యతిరేకులుగా పిలవాలని మేం అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది, ఆ విషయంలో మాకేమీ సమస్య లేదు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సాధారణమే’’ అన్నారు. ఒకవేళ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రధాని పదవికి మోదీతో పోటీ పడేది గడ్కరీయేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇంతకుముందు కూడా ఆయన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. ‘‘నేను పార్టీ అధ్యక్షుడిని అయితే, నా ఎమ్మెల్యేలు.. ఎంపీలు సరిగా పనిచేయకపోతే అప్పుడు నేనే బాధ్యుడిని అవుతాను. వాళ్లను బాగుచేయడానికి నేనేం చేశాను’’ అని గతంలో ఒకసారి ఉన్నతాధికారుల సమావేశంలో గడ్కరీ అన్నారు. కానీ తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచురించిందని చెప్పారు.
మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి పోటీచేస్తున్న గడ్కరీ.. ఇంతకుముందు మోదీ హవాతో సులభంగా నెగ్గారు. కానీ ఈసారి మాత్రం నానా పాటోల్ అనే మాజీ బీజేపీ నేత నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అయితే, తన నియోజకవర్గంలోప్రజలు అభివృద్ధి చూసి తననే ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఇంతకంటే పెద్ద బాధ్యత వచ్చే అవకాశంపై ప్రశ్నించగా, ‘‘ఇప్పటికే దానిపై నేను స్పష్టత ఇచ్చాను. మాకు తగినంత మెజారిటీ వస్తుందన్న నమ్మకం ఉంది. మోదీజీయే మా ప్రధానమంత్రి. ఆ పదవి కోసం నాకు ఎజెండా గానీ, వేరే బృందం గానీ లేవు’’ అని స్పష్టం చేశారు.