ఇస్లామాబాద్,మార్చి 2 : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని శనివారం ఆ దేశ పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు తీర్మానాన్ని ది సెక్రటేరియట్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ(దిగువసభ)లో పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌద్రీ ప్రవేశపెట్టారు.
భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇమ్రాన్ ఖాన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వాలని కోరారు. భారత్ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ను విడుదల చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించారని చౌద్రీ తెలిపారు.
‘ఇమ్రాన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆయన నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’ అని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
సోమవారం ఈ తీర్మానంపై చర్చించనున్నారు. ఇమ్రాన్ పార్టీకి మెజార్టీ ఉండటంతో ఈ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయిన్నది ఆసక్తికరంగా మారింది.
అభినందన్ ను భారత్ కు అప్పగించటంతో పాకిస్థానీలు తమ ప్రధాని శాంతిని కోరుకునే వ్యక్తని కొనియాడుతూ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు లక్షల సంతకాలతో ఆన్లైన్ పిటిషన్ను దాఖలు చేయడంతో పాటు, #NobelPeacePrizeForImranKhan అనే హ్యాష్ట్యాగ్ను ట్విటర్లో షేర్ చేస్తున్నారు.