(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కనబడకుండా పోయిన భారత వాయుసేన విమానం ఎఎన్ 32 శిధిలాలు ఎట్టకేలకు కనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లా, పయూమ్ సర్కిల్ ప్రాంతంలో విమానం శిధిలాలు కనబడ్డాయి.
విమానం కూలిన ప్రాంతానికి చేరుకుని అందులోని సిబ్బంది సజీవంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని వాయుసేన ట్వీట్ చేసింది. అస్సాంలోని జోర్హాట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల మేచుకా ఎయిర్స్ట్రిప్కు వెళుతుండగా విమానం కూలిపోయింది.
13 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ రవాణా విమానం జూన్ మూడవ తేదీన గల్లంతయింది. అప్పటినుంచీ దాని జాడ కోసం సుఖోయ్ ఎస్యు 30 యుద్ధవిమానాలు, సి 130 జె రవాణా విమానాలు, అనేక హెలీకారప్టర్లు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చివరికి వాయుసేన ఎమ్ఐ 17 హెలీకాప్టర్ ఒకటి 12 వేల అడుగుల ఎత్తు నుంచి గల్లంతయిన విమానం శిధిలాలను కనుగొన్నది.