bahujan samaj party
విజయవాడ: సొంత పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజయవాడలో జనసేన నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు బిఎస్పి అధినేత్రి మాయావతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఒక సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి కావడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ మాయావతి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని పవన్ అన్నారు.
తనతోపాటు ఎంతోమందికి మాయావతి ఆదర్శమనీ, ప్రధాని మోది కూడా మాయావతి స్ఫూర్తితోనే గుజరాత్లో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పవన్ అన్నారు.
మాయావతి తనకు బెహన్జీ కాదనీ, మాతృమూర్తి అని పవన్ పేర్కొన్నారు. బహుజన సమాజ్ పార్టీ భావజాలంతోనే జనసేన పార్టీని ఏర్పాటు చేశానని పవన్ తెలిపారు. దేశంలో బిఎస్పి కార్యకర్తలు లేని గ్రామం లేదని పవన్ అన్నారు.
ఇక డబ్బు, రాజకీయ వారసత్వం , నేర చరిత్ర ఉన్న వారే రాజకీయాల్లోకి వస్తున్నారనీ, తన లాంటి వ్యక్తులు రాజకీయాల్లో నిలదొక్కుకోలేక నలిగిపోతున్నారనీ పవన్ అన్నారు.
టిడిపి, వైసిపి ఎమ్మెల్యేలు అరాచకాలు చేస్తుంటే వారిని అడ్డుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. అదే ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రౌడీయిజాన్ని అణచివేశారని పవన్ తెలిపారు. అల్లరిమూకలు, రౌడీలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ని మాయావతి అభివృద్ధిలోకి తీసుకొచ్చారని పవన్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలతోపాటు తానూ కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, పవన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనీ మాయావతి పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ భావజాలంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని మాయావతి అన్నారు. చౌకీదార్ అంటూ మోది కొత్త నాటకానికి తెరతీశారని ఆమె విమర్శించారు.
‘బిజెపిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. దేశ ప్రజల సమస్యలను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు. పుల్వామా ఘటనను కూడా రాజకీయం చేశారు’ అని మాయావతి విమర్శించారు. సిబిఐ, ఈడి వంటి కేంద్ర సంస్థలను మోది దుర్వినియోగం చేస్తున్నారని మాయావతి ఆరోపించారు.