హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, కోరుకున్న తెలంగాణ వచ్చాక కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అని చెప్పారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపచేయడానికి తక్షణమే వారిని చర్చలకు పిలవాలని, వారిలో ధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో కార్మికులను కోరారు. ఈ నెల 19న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్కు జనసేన మద్దతు ఇస్తున్నట్టు పవన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మ బలిదానం తీవ్రంగా కలచివేస్తుంది. కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం – జనసేన అధినేత #PawanKalyan#TSRTCStrike #JanaSena #JSPWithTSRTCemployees pic.twitter.com/Mym3GCnZBU
— JanaSena Party (@JanaSenaParty) October 13, 2019
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 48 వేల మంది కార్మికులను తొలగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిణామాలతో ఖమ్మం జిల్లాకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్యహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అక్టోబర్ 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. 90 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. హైదరాబాద్లోని డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ అక్టోబర్ 13న మృతి చెందారు. ఇది మరువక ముందే హైదరాబాద్ రాణిగంజ్కు చెందిన మరో ఆర్టీసీ కండక్టర్ నరేందర్ గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ మొండి వైఖరితోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులను ప్రతిపక్షాలు, యూనియన్ నాయకులే రెచ్చగొడుతున్నారని చెబుతోంది.
19వ తేదీ ఆర్టీసీ కార్మికుల తెలంగాణ బంద్ కి జనసేన మద్దతు#TSRTCStrike #JanaSena #JSPWithTSRTCemployees pic.twitter.com/x8a3dzi9lU
— JanaSena Party (@JanaSenaParty) October 14, 2019