(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ దిశ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ నేపధ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే దిశ బతికుండగానే ఆమెను సజీవ దహనం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా దిశ సెల్ ఫోన్ ఏం చేశారో ? ఎక్కడ ఉందో విచారణలో కనుగొన్నారు. తొలుత దిశ సెల్ఫోన్ను నిందితులు మంటల్లో వేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే దానిని పాతిపెట్టినట్టు తాజా పోలీసుల విచారణలో తేలింది. ఘటనాస్థలంలో బ్రిడ్జి క్రింద మట్టిని తవ్వి సెల్ ఫోన్ ను నిందితులు పూడ్చిపెట్టారు. మరోసారి క్లూస్టీమ్ తనిఖీలు నిర్వహించి సెల్ ఫోన్ ను సేకరించింది. ఇప్పటికే పోలీసులు ఆ సెల్ఫోన్ ఆధారంగా కాల్ లిస్ట్, కాల్ రికార్డ్ను పరిశీలిస్తున్నారు. దీని ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
మరోవైపు దిశ కేసుకు సంబంధించి కీలకమైన భౌతిక సాక్ష్యాలను కూడా ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు ఉంచినట్లు సమాచారం. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టుకు సీల్డు కవరులో అందజేసినట్లు తెలుస్తుంది. టోల్ గేట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో దిశకు సంబంధించిన పర్సు, డెబిట్ కార్డు, చున్నీ, లాకెట్, ఐడీ కార్డు, లోదుస్తులు, జీన్ ఫ్యాంట్, చెప్పులను ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విచారించి వారి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు. సీన్ టూ సీన్ మొత్తం వివరాలను నిందితుల నుంచి పోలీసులు రాబట్టనున్నారు. వారం రోజుల కస్టడీలో నిందితులను విచారించి వారి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసి చార్జ్ షీట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దాఖలు చెయనున్నారు.
ఇదిఇలా ఉంటే.. ఆధారాల కోసం నిందితుల లారీని క్లూస్ టీమ్ మరోసారి పరిశీలించింది. విచారణను దర్యాప్తు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంతో.. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారు.