అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం చేయగా పోటీగా వైసిపి ఆధ్వర్యంలో తుళ్లూరులో చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం పేరిట రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రాజధాని ప్రకటన వెలువడక ముందే పలువురు టిడిపి నేతలు, వారి బంధువులు ఈ ప్రాంతంలో రైతుల నుండి భూములను కొనుగోలు చేశారని పలువురు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఎలాంటి సందర్భంలో చంద్రబాబు హైదరాబాద్ నుండి అమరావతికి పారిపోయి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సవాళ్లు, బాధ్యతలు ఉంటే వాటన్నింటినీ పట్టించుకోకుండా రాత్రికి రాత్రి హుటాహుటిన హైదరాబాద్ వదిలి అమరావతికి వచ్చారని అన్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడానికి అన్ని అధారాలు ఉన్నాయని అన్నారు. భూములు తీసుకునే అంశంపై విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు తనపై గౌరవంతో సింగపూర్ ప్రభుత్వం వచ్చి రాజధాని కోసం ప్లాన్ వేశారని అసత్యాలు చెప్పారనీ, కానీ 13 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయాన్ని దాచిపెట్టారని బుగ్గన అన్నారు. సిఆర్డిఎ పరిధి విస్తరణలోనూ చంద్రబాబు వ్యక్తిగత స్వార్థం ఉందని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేయడంతో పాటు ఒక్క భవనం కట్టేందుకు సింగపూర్కు చెందిన రెండు కంపెనీలతో ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బుగ్గన వివరించారు. శివరామకృష్ణన్ కమిటి 1500 ఎకరాలు అవసరమని చెప్పినా చంద్రబాబు 33 వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.
వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రాజధాని రైతులను, కూలీలను చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. ఆయిదేళ్లు చంద్రబాబు ప్రజలకు మాయాబజారు సినిమా చూపించారని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం రాజధానిలో పెడితే ఈ సారి చీపుర్లు పడతాయని భయపడి విజయవాడలో పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రాంత రైతులను గుంటూరు, విజయవాడలో కూలీలుగా మార్చారని శ్రీదేవి విమర్శించారు.