విజయవాడ: అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం అమరావతిపై చంద్రబాబు అధ్యక్షత టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమరావతి భావితరాల భవిష్యత్ అని, అమరావతిపై వైసీపీ నేతలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాచైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉపాధి కల్పన, సంపద సృష్టే లక్ష్యంగా అమరావతిని నిర్మించాలనుకున్నామని తెలిపారు. తాము చేసిన అభివృద్ధిని ‘గ్రాఫిక్స్’ అని ఎగతాళి చేశారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ కంటే గొప్పగా అమరావతి నిర్మాణం చేద్దామనుకున్నానని, ప్రపంచ రాజధానుల్లో ఒకటిగా అమరావతి వుండాలని తన హయంలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని చంద్రబాబు వివరించారు. సంపద సృష్టించలేకపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు.. అది లేకపోతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేమన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు రోజూ 50 వేల మంది రాజధాని ప్రాంతంలో పనిచేసేవారని, ఇప్పుడు పనులన్నీ ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరు నెలల్లో నిర్మాణాలను పూర్తి చేసి ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉండేవారి అభిప్రాయపడ్డారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్యే బాలకృష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనసేన నుంచి పోతిన మహేష్, ఆర్ఎస్పీ నుంచి జానకి రాములు, ఫార్వర్డ్ బ్లాక్, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు.