అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో చంద్రబాబు హయాంలో ఉండవల్లిలోని ఆయన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను నిర్మించారు. ఈ ప్రజావేదికలో ఐఎఎస్, ఐపిఎస్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ భవనంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆక్రమ నిర్మాణాల తొలగింపు ఈ భవనం నుండే ప్రారంభించాలని, రెండు రోజుల సమావేశం ముగిసిన వెంటనే ప్రజావేదికను కూల్చివేయాలని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాలతో సిఆర్డిఎ అధికారులు మంగళవారం రాత్రి నుండే కూల్చివేత పనులు మొదలు పెట్టారు. భవనంలో ఫర్చీచర్, కంప్యూటర్లు, ఎసి మిషన్లు ఇతరత్రా సామాను సిఆర్డిఎ కార్యాలయానికి తరలించారు. కరకట్ట ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలో తీసుకొని భారీ భద్రత మధ్య ప్లొక్లైయిన్, ఇతర యంత్ర సామాగ్రి, కూలీలతో భవనాన్ని నేలమట్టం చేశారు. భవనం కూల్చివేత పనులు కొనసాగున్న సమయంలో మంగళవారం రాత్రి 12గంటల సమయంలో చంద్రబాబు కుటుంబ సమేతంగా నివాసానికి చేరుకున్నారు. కరకట్ట వద్ద పోలీసులు చంద్రబాబు కాన్వాయ్కు మాత్రమే అనుమతి ఇచ్చి టిడిపి శ్రేణులను నిలువరించారు.
ప్రజావేదిక భవనం కూల్చివేతను తక్షణం నిలుపుదల చేయాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం అర్థరాత్రి 2.30గంటలు దాటిన తరువాత కూడా హైకోర్టు జడ్జి ఎదుట విచారణ కొనసాగింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్లు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం, అదనపు ఏజి పొన్నవోలు సుధాకరరెడ్డి హజరయ్యారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అయితే అక్రమ కట్టడమని పిటిషనరే స్పష్టం చేయడంతో పాటు అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవంచిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను రెండు వారాలు వాయిదా వేశారు.