హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఇష్టం వచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టం చేశారు. సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఓవైపు పోరాటం అంటూనే మరోవైపు విధుల్లో చేరతామంటున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు సమ్మెకు దిగారని చెప్పారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని తెలిపారు.
హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం అసాధ్యమన్నారు. కార్మికశాఖ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని, లేబర్ కోర్టు ఆదేశాలు వచ్చేవరకు సంయమనంతో ఉండాలని పేర్కొన్నారు. యూనియన్ల మాట విని కార్మికులు నష్టపోయారని, ఇకపై యూనియన్ల మాట విని మరిన్ని కష్టాలు తెచ్చుకోవద్దని హితవు పలికారు. డిపోల వద్ద శాంతిభద్రతల సమస్యలు సృష్టించవద్దని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ క్షమించదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎండీ సునీల్ శర్మ చెప్పారు.
ఇదిఇలా ఉంటే.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీని బతికించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 52 రోజులపాటు కొనసాగించిన పోరాటంలో ఎవరమూ ఓడిపోలేదన్నారు. తాము చేపట్టిన ఈ పోరాటం ఆర్టీసీని బతికించుకోవడానికేనని తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావద్దని ఆయన కోరారు. హైకోర్టు చేసిన సూచన ప్రకారం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సమ్మె విరమణ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.