అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపైనా అధ్యయనం చేయాలని కోరుతూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఐఐఎం అహ్మదాబాద్ కు బహిరంగ లేఖ రాశారు. జగన్ పై 31 క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ విచారణ కూడా కొనసాగుతోందని లేఖలో పేర్కొన్నారు. జగన్ ఎన్నో సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు మళ్లించారని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ అవినీతికి పాల్పడ్డాడని వివరించారు. సీఎం అయ్యాక ఇసుక, మద్యం, మైనింగ్ లో భారీస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా, ఐఐఎం అధ్యయనానికి పూర్తి సహకారం అందిస్తామని కళా వెంకట్రావు తన లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన కోసం ఐఐఎం అహ్మదాబాద్ నిపుణులతో ఏపీ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఐఐఎం ప్రొఫెసర్ సుందరపల్లి నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ సంతకాలు చేశారు. ఈ బృందం ఏయే ప్రభుత్వ శాఖల్లో, ఏయే స్థాయిల్లో అవినీతి చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉందో గుర్తిస్తుంది. అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తుంది. 2020 ఫిబ్రవరి మూడో వారంలో ఐఐఎం నిపుణులు జగన్ సర్కారుకు నివేదిక సమర్పించనుంది.