శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్, లద్దాఖ్లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన పునర్విభజన చట్టం ఈ నెలాఖరు నుంచి అమలు కానుంది. అక్టోబర్ 31న కొత్త లెఫ్టినెంట్ గవర్నర్తో కూడా ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులు అవుతారనే విషయమై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే, అసెంబ్లీతో కూడిన కశ్మీర్ రాష్ట్రానికి ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్నే తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. కశ్మీర్, లద్దాఖ్లో ప్రస్తుత పరిస్థితులు సత్యపాల్ మాలిక్కు తెలిసినంతగా మరొకరికి అవగాహన ఉండకపోవచ్చనే భావనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ ప్రాంతలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా సత్యపాల్ మాలిక్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా సత్యపాల్ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుండడంతో తిరిగి సత్యపాల్ మాలిక్ను లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
సత్యపాల్ మాలిక్ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైతే తిరిగి అక్టోబర్ 31 తర్వాత మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్రం మొత్తం పూర్తిగా లెప్టినెంట్ గవర్నర్ చేతిలోకి వెళ్లనుంది. అయితే ఎన్నికలు నిర్వహించిన తర్వాత పోలీసుల ఇతర భద్రతా వ్వవహారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉండగా మిగతా సాధరణ పరిపాలన మాత్రం ప్రభుత్వం చేతుల్లో కొనసాగనుంది. పోలీసులు, శాంతి భద్రతల అజమాయిషీ ఢిల్లీ మాదిరిగా కేంద్రం పరిధిలోకి రానుంది.
జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని ఆగస్ట్ 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రంలో పలు ఆంక్షలు విధించింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాతో సహా దాదాపు 400 మంది రాజకీయ నాయకులను ప్రభుత్వం గృహ నిర్బంధంలోకి తీసుకుంది. కమ్యూనికేషన్, ఇంటర్నెట్లపై నిషేధం విధించడంతో రెండు నెలలపాటు రాష్ట్రంలో అన్ని వ్యవస్ధలు దాదాపు మూతపడ్డాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో దశలవారీగా ఆంక్షలను ఎత్తివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. జమ్ముకశ్మీర్ లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైయ్యాయి. కశ్మీర్ లోని పది జిల్లాల్లో మొబైల్ ఫోన్లపై విధించిన నిషేధాన్ని కూడా ఎత్తివేశారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన దాదాపు రెండు నెలల తరువాత గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఎన్సీ పార్టీ నేతలు ఇటీవలే కలిశారు. మరోవైపు రెండు నెలల నిషేధం తర్వాత జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తున్నది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ నుంచి పర్యాటకులను హుటాహుటిన వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే పర్యాటకుల రాకపై ఉన్న నిషేధాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.