న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రామ్జాల్ మీనా అదే యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక అతను బిఎ (రష్యా భాష) చదువుతాడు.
రాజస్థాన్లోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన మీనా 2014 నుంచి జెఎన్యులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి ఇప్పటికే రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఒక బిఎ (దూరవిద్య) డిగ్రీ ఉంది. అదే యూనివర్సిటీ నుంచి ఎమ్ఎ పొలిటికల్ సైన్స్ మొదటి సంవత్సరం కోర్సు కూడా అయిపోయింది.
34 ఏళ్ల మీనాకు చదువు అంటే విపరీతమైన మక్కువ. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పుస్తకం తెరుస్తాడు. అయితే కుటుంబం ఆర్ధిక పరిస్థితి అనుకూలించక చదువు కట్టిపెట్టి ఉద్యోగంలో చేరాడు. కొన్నాళ్ల తర్వాత దూరవిద్యలో చదువు కొనసాగించాడు. ఇప్పుడు జెఎన్యులో చదవడానికి రెడీ అవుతున్నాడు.
అయితే చదవాలంటే ఉద్యోగం మానాలి. కుటుంబాన్ని తానే పోషించాలి కాబట్టి అది సాధ్యం కాదు. అందుకని పగలు చదువుకుంటూ రాత్రి షిఫ్టులో పని చేసేందుకు అనుమతించాల్సిందిగా యూనివర్సిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తానని మీనా చెప్పినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది.